భద్రతాదళాల కాల్పులు: ఇద్దరు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్: దక్షిణ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో అక్రమంగా ఓ ఇంట్లో దాక్కుని కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులపై భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరుపుతున్నాయి. నయీనా బాట్పూరా ప్రాంతంలోని ఓ ఇంట్లో ఇద్దరు ఉగ్రవాదులు దాక్కొని మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు కాల్పులకు తెగబడ్డారు.
అక్కడికి భారీగా చేరుకున్న భద్రతా దళాలు.. ఉగ్రవాదులపై కాల్పులు జరిపాయి. దీంతో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ మేరకు ఆర్మీ అధికారులు బుధవారం ఉదయం వెల్లడించారు.

ఎర్రకోటపై దాడి కేసు: అరిఫ్ పిటిషన్పై పునర్విచారణ చేపట్టనున్న సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ఎర్రకోటపై 16 ఏళ్ల క్రితం జరిగిన దాడి కేసులో మరణశిక్ష ఖరారైన మహ్మద్ అరిఫ్ దాఖలు చేసిన సమీక్షా పిటిషన్పై బహిరంగ పునర్విచారణకు సుప్రీంకోర్టు మంగళవారం అనుమతించింది. వాస్తవానికి అరిఫ్ సమీక్షా పిటిషన్ను న్యాయస్థానం గతంలోనే కొట్టివేసింది.
సమీక్షా పిటిషన్ల బహిరంగ విచారణకు సంబంధించి 2014లో సుప్రీం కోర్టు మార్గదర్శకాలు వెలువరించడానికి ముందే తన సమీక్షా-క్యూరేటివ్ పిటిషన్లను కొట్టివేశారని.. అందువల్ల ప్రత్యేక కేసుగా భావించి ప్రస్తుతం తన పిటిషన్పై బహిరంగ పునర్విచారణ జరపాలని అరిఫ్ విన్నవించారు.
కాగా, సమీక్షా పిటిషన్లు పెండింగ్లో ఉన్నప్పుడు, ఉరిశిక్ష నిర్ధారణ అయినప్పటికీ ఇంకా అమలు కానప్పుడు.. సదరు సమీక్షా పిటిషన్లపై బహిరంగ న్యాయస్థాన విచారణకు అనుమతిస్తూ 2014లో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు వెలువరించింది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం.. అరిఫ్ వినతిని ఆమోదించి, 2014 నాటి మార్గదర్శకాల్లో తదనుగుణంగా మార్పులు చేసింది. మరణశిక్ష ఖరారైన వారి సమీక్షా-క్యూరేటివ్ పిటిషన్లపై బహిరంగ విచారణకు.. 2014 నాటి మార్గదర్శకాలకు పూర్వం అనుమతి ఉండేది కాదు. అరిఫ్ మరణశిక్ష అమలును 2014 ఏప్రిల్ 28న సుప్రీంకోర్టు నిలిపివేసింది.












Click it and Unblock the Notifications