కేరళలో ఇద్దరు కాంగ్రెస్ కార్యకర్తల దారుణ హత్య.. సీపీఎం పార్టీ పాత్ర ఉందంటున్న కాంగ్రెస్
కేరళలో ఇద్దరు యూత్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల హత్య షాక్ కు గురి చేసింది. కాసరగాడ్ జిల్లాలో ఇద్దరు కాంగ్రెస్ కార్యకర్తలను గుర్తు తెలియని దుండగులు అపహరించి వారి హత్యకు పాల్పడ్డారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లైన క్రిపేష్ , శరత్ లాల్ ఒక కార్యక్రమానికి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్లి పోతున్న సమయంలో ఎస్ యూ వీ వాహనంలో వచ్చిన దుండగులు వారిని అపహరించి దారుణంగా హత్య చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దారుణ జంట హత్యలతో ఒక్కసారిగా కాసర్ గాడ్ ఉలిక్కిపడింది. అయితే ఇవి రాజకీయ హత్యలని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. రాజకీయ దుమారం రేపుతున్న ఈ జంట హత్యల కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హత్య వెనుక సిపిఎం పార్టీ పాత్ర... కాంగ్రెస్ సంచలన ఆరోపణలు
కాంగ్రెస్ కార్యకర్తల దారుణ హత్యల వెనుక సిపిఎం పార్టీ కార్యకర్తల పాత్ర ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో సిపిఎం పార్టీ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా పనిచేస్తున్న కార్యకర్తలను ఊహించని విధంగా పొట్టనపెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ నాయకుడు రమేష్ చెన్నితల ఆరోపించారు. హత్యా రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మృతి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలను నేడు పరామర్శించడం తో పాటుగా కాంగ్రెస్ కార్యకర్తలు హత్య నేపథ్యంలో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ జిల్లాలో ఆందోళనకు పిలుపునిచ్చారు. దీంతో కాసర్ గాడ్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేసిన క్రిపేష్ , శరత్ లాల్ లకు ఎలాంటి నేరచరిత్ర లేదని, గతంలో కూడా ఎటువంటి కేసులు నమోదు కాలేదని తెలిపిన రమేష్ చెన్నితల ఈ జంట హత్యలకు కారణమైన వారిని త్వరగా పోలీసులు పట్టుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ హత్య తో మాకు సంబంధం లేదు... సిపిఎం పార్టీ
కాంగ్రెస్ కార్యకర్త లైన క్రిపేష్ , శరత్ లాల్ ల హత్య వెనుక సిపిఎం పార్టీ ఉందని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఎంవీ బాలకృష్ణన్ దీనిపై స్పందించారు. ఈ హత్యలను తాము ఖండిస్తున్నామని, హత్యారాజకీయాలకు తమ పార్టీ వ్యతిరేకమని ఆయన పేర్కొన్నారు. ఈ హత్యలతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నట్లు తమకు ఎలాంటి సంబంధం లేదని ఆయన తెలిపారు.
జంటహత్యలపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఆదివారం రాత్రి మృతదేహాలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో పోలీసులు వారు క్రిపేష్ , శరత్ లాల్ గా గుర్తించారు. ఈ జంటహత్యల కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యకు పాల్పడిన వారిని పట్టుకునే పనిలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. అసలు ఎవరు ఎందుకు వీరిని హత్యా చేశారు. హత్యకు దారితీసిన రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయా? లేకా వ్యక్తిగత కక్షలతో వీరిని హతమార్చారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
కార్యకర్తల మృతి పై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ
కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దారుణ హత్యల పైన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యూత్ కాంగ్రెస్ కార్యకర్తల మరణంతో ఆవేదన వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. తన ప్రగాఢ సానుభూతిని తెలియజేయడంతోపాటు హత్యకు పాల్పడిన వారిని శిక్షించే వరకు విడిచిపెట్టేది లేదంటూ రాహుల్ గాంధీ కాంగ్రెస్ కార్యకర్తల హత్యపై ట్వీట్ చేశారు.