యూకె నుంచి భారత్ వచ్చిన 20 మందికి కరోనా పాజిటివ్... శాంపిల్స్ పుణే వైరాలజీ ల్యాబ్కు...
యూకె నుంచి భారత్ వచ్చిన ప్రయాణికుల్లో 20 మందికి కరోనా పాజిటివ్గా నిర్దారణ అయింది. ఢిల్లీ,చెన్నై,కోల్కతా ఎయిర్పోర్టుల్లో దిగిన వీరికి టెస్టుల్లో పాజిటివ్గా తేలింది. మంగళవారం(డిసెంబర్ 22) అర్ధరాత్రి నుంచి బ్రిటన్కు విమాన రాకపోకలు నిషేధించినప్పటికీ అంతకు కొద్ది గంటల ముందు ల్యాండ్ అయిన విమానాల్లో వీరు భారత్ చేరినట్లు సమాచారం.
నిన్న(సోమవారం) యూకె నుంచి తమిళనాడుకు వచ్చిన 24 మంది ప్రయాణికుల్లో ఒకరికి పాజిటివ్గా నిర్దారణ అయినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాధాకృష్ణన్ తెలిపారు. మొత్తం 24 మందిలో 15 మందికి సోమవారం,9 మందికి మంగళవారం కరోనా టెస్టులు నిర్వహించినట్లు చెప్పారు. పాజిటివ్గా తేలిన వ్యక్తిని కాంటాక్ట్ అయిన 15 మందిని గుర్తించామని... వీరంతా అతనితో పాటే ఎయిర్ ఇండియా 553 విమానంలో ప్రయాణించారని చెప్పారు. ప్రస్తుతం వీరంతా హోమ్ క్వారెంటైన్లో ఉన్నట్లు తెలిపారు. గడిచిన 7 రోజుల్లో మొత్తం 1088 మంది ప్రయాణికులు బ్రిటన్ నుంచి తమిళనాడు వచ్చినట్లు చెప్పారు.
యూకె నుంచి తిరిగొచ్చినవారిలో ఏడుగురు ప్రయాణికులు,ఒక విమాన సిబ్బందికి కరోనా పాజిటివ్గా నిర్దారణ అయినట్లు పంజాబ్ మంత్రి ఓపీ సోనీ తెలిపారు. వీరంతా ఎయిర్ ఇండియా విమానంలో వచ్చినట్లు చెప్పారు. ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన మరో ఆరుగురు యూకె రిటర్నీస్కి కూడా పాజిటివ్గా తేలింది.
పాజిటివ్గా తేలిన అందరి శాంపిల్స్ను పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్కు పంపించారు. మరికొద్ది రోజుల్లో ఆ రిపోర్టులు రానున్నాయి. బ్రిటన్లో కొత్త కోవిడ్ 19 స్ట్రెయిన్ వెలుగుచూడటంతో వీరిలో ఎవరికైనా కొత్త రకం వైరస్ సోకిందా అన్నది పరిశీలించనున్నారు.
బ్రిటన్లో వెలుగుచూసిన కొత్త రకం కరోనా వైరస్ నియంత్రణలో లేదని అక్కడి ఆరోగ్య శాఖ ప్రకటించడం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేస్తోంది. రూపాంతరం చెందిన వైరస్ 70శాతం వేగంగా విస్తరిస్తున్నట్లు అక్కడి నిపుణులు చెప్తున్నారు.బ్రిటన్లో 1000కి పైగా కేసుల్లో ఈ కొత్త రకం కరోనా వైరస్ను గుర్తించినట్లు చెప్పారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన,రాబోతున్న కరోనా వ్యాక్సిన్లు ఈ కొత్త రకం వైరస్ను నియంత్రించగలుగుతాయా అన్నది ఇప్పుడే చెప్పలేమని సైంటిస్టులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్ సహా కెనడా,ఆస్ట్రేలియా,ఫ్రాన్స్,జర్మనీ,ఆస్ట్రియా,ఇటలీ,హాంకాంగ్ తదితర దేశాలు ఇప్పటికే బ్రిటన్కు విమాన సర్వీసులు రద్దు చేశాయి.