బూటకపు ఎన్కౌంటర్: ఆర్మీ ఆఫీసర్లకు జీవిత ఖైదు
శ్రీనగర్: బూటకపు ఎన్కౌంటర్ కేసులో ఏడుగురు సైనికాధికారులకు జీవిత ఖైదు పడింది. 2010లో జమ్మూ కాశ్మీర్లోని మాచిల్ ప్రాంతంలో ముగ్గురు కాల్పుల్లో మరణించారు. ఉగ్రవాదులు అనే ముద్ర వేసి సాధారణ పౌరులను హతమార్చినట్లు ఆ సైనికాధికారులపై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఇద్దరు అధికారులతో సహా మొత్తం ఏడుగురిపై నేరం రుజవైంది.
శిక్ష పడిన ఏడుగురులో ఓ కమాండింగ్ ఆఫీసర్ కూడా ఉన్నారు. వారి సర్వీసు ప్రయోజనాలను కూడా సస్పెండ్ చేశారు. 2010లో ఉత్తర కాశ్మీర్ ప్రాంతానికి చెందిన ముగ్గురు యువకులను ఉద్యోగాలు ఇప్పిస్తామనీ డబ్బు ఇస్తామనీ చెప్పి మభ్యపెట్టి కుప్వారా ప్రాంతానికి పిలిపించారు.

కుట్ర పన్ని వారిని పిలిపించినట్లు ఆరోపణలు వచ్చాయి. వారిని నియంత్రణ రేఖ వద్దకు తీసుకుని వెళ్లి బూటకపు ఎదురు కాల్పుల్లో హతమార్చినట్లు సైనికాధికారులపై అభియోగం మోపారు. వాళ్లంతా పాకిస్తాన్ ఉగ్రవాదులని, సరిహద్దు రేఖ దాటి మన దేశంలోకి రావడానికి ప్రయత్నిస్తుండగా జరిగిన ఎదురు కాల్పుల్లో వారు మరణించారని చెప్పారు.
ఆ ఘటనతో కాశ్మీర్ లోయ ప్రాంతంలో సైన్యంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. మృత్యువాత పడిన ముగ్గురిని షాజాద్ అహ్మద్ ఖాన్, రియాజ్ అహ్మద్ లోన్, ముహమ్మద్ షఫిలుగా గుర్తించారు. వారంతా నధిహాల్ బారాముల్లాకు చెందినవారు. వారంతా ఆ ఏడాది ఏప్రిల్ 27వ తేదీ నుంచి కనిపించకుండా పోయారు.












Click it and Unblock the Notifications