మోడీ పాట్నా ర్యాలీలో పేలుళ్లు: నలుగురికి ఉరిశిక్ష, ఇద్దరికి జీవితఖైదు
పాట్నా: బీహార్ రాజధాని పాట్నాలో 2013లో నరేంద్ర మోడీ ర్యాలీ సందర్భంగా జరిగిన పేలుళ్ల ఘటనలో నలుగురు దోషులకు మరణశిక్ష పడింది. ఈ కేసులో ఇప్పటికే 9 మందిని దోషులుగా తేల్చిన ఎన్ఐఏ(జాతీయ దర్యాప్తు సంస్థ) ప్రత్యేక కోర్టు.. సోమవారం శిక్ష ఖరారు చేసింది.
నలుగురికి ఉరిశిక్షతోపాటు, ఇద్దరికి జీవిత ఖైదు, మరో ఇద్దరికి పదేళ్ల జైలు శిక్ష విధించింది. మరో దోషికి ఏడేళ్ల శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. 2013లో ఎన్డీఏ ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీని ప్రకటించిన సందర్భంగా పాట్నాలోని గాంధీ మైదానంలో 'హుంకార్' పేరుతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆ సమయంలో నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.

కాగా, మోడీ ప్రసంగం చేయాల్సిన వేదికకు 150 మీటర్ల దూరంలోనే వరుసగా ఆరు పేలుళ్లు సంభవించాయి. మోడీ, ఇతర బీజేపీ నాయకులు సభా వేదికకు రాకముందే ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ పేలుళ్లలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, 70 మందికిపైగా గాయపడ్డారు. అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేసింది.
మొత్తం 11 మందిని నిందితులుగా పేర్కొంటూ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. దీనిపై ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం గత వారం విచారణ జరిపింది. నిందితుల్లో ఒకరు మైనర్ కావడంతో అతడి కేసును జువైనల్ జస్టిస్ బోర్డుకు బదిలీ చేసింది. మరో వ్యక్తిని సరైన ఆధారాలు లేని కారణంగా నిర్దోషిగా ప్రకటించింది. మిగితా 9 మందిని దోషులుగా తేల్చి సోమవారం శిక్షలు ఖరారు చేసింది. కాగా, నిందితుల్లో తొమ్మిది మంది ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) సభ్యులు మరియు ఒకరు స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)తో సంబంధం కలిగి ఉన్నారు.












Click it and Unblock the Notifications