El Nino:10 రాష్ట్రాలకు కేంద్రం హైఅలర్ట్.. రైతులకు బిగ్ అలర్ట్!
ప్రస్తుత ఖరీఫ్ సీజన్పై పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన 'ఎల్ నినో’ (El Niño) ప్రతికూల ప్రభావాలు చూపే అవకాశం ఉందన్న హెచ్చరికలతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలోని దాదాపు 10 రాష్ట్రాలలో దీని ప్రభావం తీవ్రంగా ఉండవచ్చని అంచనా వేస్తున్న తరుణంలో, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వర్షపాతం తక్కువగా నమోదయ్యే జిల్లాల్లో ముందస్తుగా ప్రత్యామ్నాయ ప్రణాళికలను (Contingency Plans) సిద్ధం చేయాలని, రైతులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించి భరోసా కల్పించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించారు.
ప్రతికూల వాతావరణ పరిస్థితులు తలెత్తితే రైతులు నష్టపోకుండా ఉండేందుకు వీలుగా.. ప్రమాదం పొంచి ఉన్న జిల్లాలను ముందే గుర్తించాలని మంత్రి సూచించారు. అక్కడి స్థానిక వాతావరణానికి, నేల స్వభావానికి అనుగుణంగా ప్రత్యేక పంటల ప్రణాళికను రూపొందించాలన్నారు. "ఆయా ప్రాంతాల్లో నీటి సంరక్షణ, భూమిలో తేమ నిర్వహణ, అంతర పంటల సాగు (Intercropping) తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటల రకాలపై రైతులకు ముందస్తుగా విస్తృత అవగాహన కల్పించాలి" అని మంత్రి స్పష్టం చేశారు. రైతులను కంగారు పెట్టే సమాచారం కాకుండా, శాస్త్రీయ విశ్లేషణలతో కూడిన ఖచ్చితమైన పరిష్కార మార్గాలను మాత్రమే వారికి చేరవేయడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతని ఆయన నొక్కి చెప్పారు.

ఈ రాష్ట్రాలకు హైఅలర్ట్ - కలెక్టర్లకు ఆదేశాలు
- మహారాష్ట్ర (ముఖ్యంగా విదర్భ, మరాఠ్వాడా ప్రాంతాలు)
- కర్ణాటక
- ఆంధ్రప్రదేశ్ (ముఖ్యంగా రాయలసీమ, ప్రకాశం వంటి వర్షభావ జిల్లాలు)
- గుజరాత్ (సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాలు)
- రాజస్థాన్ (పశ్చిమ ప్రాంతం)
- మధ్యప్రదేశ్ (పశ్చిమ జిల్లాలు)
- తెలంగాణ
- ఛత్తీస్గఢ్
- జార్ఖండ్
- ఒడిశా / బీహార్
పప్పుధాన్యాల స్వయంసమృద్ధి.. పత్తి సాగుకు ప్రాధాన్యత
దేశీయంగా పప్పుధాన్యాల ఉత్పత్తిని పెంచి, విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక మిషన్ను వేగవంతం చేస్తోంది. పంటల మార్పిడి విధానంలో భాగంగా కందులు, మినుములు, పెసల సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు అవసరమైన సాంకేతిక సాయం, నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులోకి తేవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. దీనితో పాటు, పత్తి ఉత్పాదకతను మెరుగుపరిచి రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ఆధునిక శాస్త్రీయ పద్ధతులు, మల్చింగ్ (నేలపై కప్పు వేయడం) అంతర పంటల విధానాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని పేర్కొన్నారు.
ఎరువుల ముందస్తు సరఫరా.. శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయికి రావాలి
దేశవ్యాప్తంగా సాగునీటి నిల్వలు, ఎరువుల లభ్యతపై సమీక్షిస్తూ, ప్రస్తుతం జాతీయ స్థాయిలో ఎరువుల నిల్వలు ఆశాజనకంగానే ఉన్నాయని మంత్రి తెలిపారు. అయితే, రుతుపవనాల పురోగతికి అనుగుణంగా మైక్రో-లెవెల్లో ఏ జిల్లాలోనూ ఎరువుల కొరత ఏర్పడకుండా ముందస్తుగానే సరఫరాను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు (KVKs), ఐకార్ (ICAR) సంస్థలు, రాష్ట్ర వ్యవసాయ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. పరిశోధనా సంస్థల వద్ద ఉన్న ఆధునిక శాస్త్రీయ పరిజ్ఞానం సకాలంలో నేరుగా పంట పొలాల్లోకి చేరినప్పుడే ఈ విపత్కర పరిస్థితుల్లో ఖరీఫ్ పంటలు సురక్షితంగా ఉంటాయని శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యాఖ్యానించారు.














Click it and Unblock the Notifications