2018:8 రాష్ట్రాల్లో ఎన్నికలు, మోడీ, రాహుల్కు సవాల్, 2019 ఎన్నికలకు సెమీఫైనల్
న్యూఢిల్లీ: ఈ ఏడాది 8 రాష్ట్రాలకు జరిగే ఎన్నికల్లో ప్రజలిచ్చే తీర్పు 2019 ఎన్నికలకు సెమీ ఫైనల్గా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.ఈ 8 రాష్ట్రాల నుండి 99 ఎంపీ స్థానాలున్నాయి. దీంతో ఈ ఎన్నికలకు ప్రాధాన్యత ఏర్పడింది. కాంగ్రెస్, బిజెపిలు ఈ ఎన్నికలపై కేంద్రీకరించనున్నాయి.
గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బిజెపికి చుక్కలు చూపించింది. గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గతంలో కంటే మెరుగైన ఫలితాలను సాధించింది. అయితే మిషన్ 150 లక్ష్యంతో ఎన్నికల బరిలోకి దిగిన బిజెపికి ఈ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడం కూడ బిజెపికి కొంత కలిసొచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇంకా వ్యూహత్మకంగా అడుగులు వేస్తే గుజరాత్ ఫలితాలు మరోలా ఉండేవనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.
రాహుల్కు అగ్నిపరీక్ష
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఇటీవలనే రాహుల్ గాంధీ భాద్యతలను చేపట్టారు. దేశంలోని 8 రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలు రాహుల్ నాయకత్వానికి అగ్నిపరీక్షలాంటివని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2019 ఎన్నికలకు ఈ 8 రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలను సెమీ ఫైనల్గా భావిస్తున్నారు. ఈ రాష్ట్రాల నుండి 99 ఎంపీ స్థానాలున్నాయి. దీంతో ఈ ఎన్నికలకు ప్రాధాన్యత ఏర్పడింది.
8 రాష్ట్రాల్లో కాంగ్రెస్, బిజెపి ముఖాముఖి
ఈ ఏడాది 8 రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెస్ పార్టీల మధ్య ముఖాముఖి పోటీ జరిగే అవకాశం ఉంది. త్రిపురలో మాత్రం సిపిఎం, కాంగ్రెస్ మధ్య పోటీ ఉండే అవకాశం ఉంది. అయితే ఈ ఎన్నికలను బిజెపి కూడ ప్రతిష్టాత్మకంగా తీసుకొంటుంది. మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి నాలుగేళ్ళు పూర్తవుతన్న సమయంలో జరిగే ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పు 2019 ఎన్నికల్లో ప్రభావం చూపనుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
గెలుపు కాంగ్రెస్కు అవసరం
వరుస ఓటములు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందిని కల్గిస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోతోంది. అయితే ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. అయితే ఆయా రాష్ట్రాల్లో విజయం సాధించడం కాంగ్రెస్ పార్టీకి అనివార్యం. దీని కారణంగా రాష్ట్రాల్లో విజయం సాధిస్తే రాజ్యసభలో కాంగ్రెస్ ప్రాతినిథ్యం పెరిగే అవకాశం ఉంది.
మోడీ పాలనకు తీర్పు
నాలుగేళ్ళ మోడీ పాలనకు 8 రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పుగా భావించవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ 8 రాష్ట్రాల్లో బిజెపి పాలిత రాష్ట్రాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ రాష్ట్రాల్లో మరోసారి బిజెపి అధికారాన్ని నిలబెట్టుకొంటుందా లేదా అనేది కూడ ఆసక్తికరంగా మారింది. ఎన్నికల సమయానికి ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా పార్టీల మధ్య పొత్తులు పెట్టుకొనే అవకాశం లేకపోలేదు.