2021 వైరల్ వీడియోలు: సోషల్ మీడియాను కదిలించిన 5 వీడియోలను ఇక్కడ చూసేయండి...
కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేసిన నెలల వ్యవధిలోనే తాజాగా ఒమిక్రాన్ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. దీంతో మళ్లీ అందరిలోనూ ఆరోగ్యం పట్ల భయం ప్రారంభమైంది. కరోనా వల్ల ఈ ఏడాదంతా అందరూ బిక్కుబిక్కుమంటూ గడిపారు.
ఈ కఠిన పరిస్థితుల్లో అందరూ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా మారారు. ప్రత్యేకంగా నిలిచిన కొన్ని క్షణాలను నెటిజన్లు విపరీతంగా ఆదరించారు.
2021లో ప్రజలకు భరోసానిచ్చిన 5 క్షణాల గురించి తెలుసుకుందాం.
1. ఐదేళ్ల కోవిడ్ వారియర్
ఏప్రిల్, మే నెలల్లో ప్రాణాంతక కరోనా వైరస్ సెకండ్ వేవ్ భారత్ను వణికించింది. ఆరోగ్య వ్యవస్థలను చిన్నాభిన్నం చేసింది. మే 6న భారత్లో గరిష్టంగా 4,14,000 కొత్త కేసులు నమోదయ్యాయి.
ఆ తర్వాత కొత్తగా నమోదయ్యే కేసుల సంఖ్య తగ్గడంతో ప్రభుత్వాలు ఆంక్షల్ని సడలించాయి. దీంతో ప్రసిద్ధ ప్రాంతాలకు పర్యాటకుల తాకిడి పెరిగింది.
మాస్కులు ధరించకుండా తిరుగుతోన్న పర్యాటకుల వీడియోలు బయటకు రావడంతో జూలైలో ప్రభుత్వం, కోవిడ్ ప్రోటోకాల్ను పాటించాల్సిందిగా ప్రజలను కోరింది.
అదే సమయంలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ధర్మశాలలో రద్దీగా ఉన్న ఒక మార్కెట్లో చిత్రీకరించిన ఒక వీడియో వైరల్గా మారింది.
ఆ వీడియలో ఐదేళ్ల బాలుడు అమిత్, కాళ్లకు చెప్పులు కూడా లేకుండా ఒక చేతిలో బాటిల్, మరో చేతిలో కర్రను పట్టుకొని మాస్క్ ధరించని వారిని కర్రతో నెమ్మదిగా అదిలిస్తున్నాడు. వారిని మాస్కులు పెట్టుకోవాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాడు.
అతని చేష్టలతో కొందరు పర్యాటకులు ఆశ్చర్యపోగా, మరికొందరు అతని చైతన్యాన్ని చూసి ముచ్చట పడ్డారు. ఒకరు ప్రేమగా ఆ బాలున్ని తట్టారు. అమిత్ చర్య, స్థానిక పోలీసులను ఆకట్టుకుంది. వారు ఆ బాలునికి బూట్లు, స్నాక్స్ కొన్నారు. కరోనా వైరస్ అవగాహన కోసం అతన్ని మస్కట్గా పరిగణిస్తామని చెప్పారు.
ఆ బాలునికి సహాయం చేసేందుకు స్థానికులు కూడా ముందుకు వచ్చారని నివేదికలు తెలిపాయి. తన తల్లిదండ్రులకు సహాయం చేసేందుకు అమిత్ బెలూన్లను అమ్ముతూ జీవనోపాధి పొందుతున్నారు.
- ఈ సుఖ వ్యాధి ఎందుకొస్తుంది, ఎలా వస్తుంది
- ఒమిక్రాన్ సోకిన వారిలో కనిపించే లక్షణాలు ఏంటి, ఈ లక్షణాలు కనిపిస్తే ఏం చేయాలి?
2. భారత్, పాక్ కలిసి పార్టీ చేసుకున్నప్పుడు...
పాకిస్తాన్కు చెందిన డాననీర్ మోబీన్ ఫిబ్రవరిలో 5 సెకన్ల వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. దాంతో ఆమె భారత్-పాక్ సరిహద్దుల్లో పాప్ కల్చరల్ స్టార్గా మారిపోయారు.
ఈ వీడియోలో 19 ఏళ్ల మోబీన్ తన కారువైపు, స్నేహితుల వైపు చూపిస్తూ... 'ఇది మా కారు, ఇది మేము. మేం పార్టీ చేసుకుంటున్నాం' అని అన్నారు.
ఆమె పార్టీ అనే పదాన్ని కాస్త వింతగా పలకడం అందర్నీ ఆకట్టుకుంది.
పాకిస్తాన్ వెలుపల చదువుకొని అమెరికా లేదా బ్రిటీష్ యాక్సెంట్తో మాట్లాడే పాకిస్తాన్ ధనిక కుటుంబాలకు చెందిన వారిని సూచించడానికి 'బర్గర్స్' అనే పదాన్ని వాడుతుంటారు. ఆమె 'బర్గర్' అనే పదాన్ని వ్యంగ్యంగా వాడుతూ పోస్ట్కు క్యాప్షన్ ఇచ్చారు.
ఈ వీడియో పాకిస్థాన్లో వైరల్గా మారింది. ఆ తర్వాత భారత్కు చెందిన మ్యూజిక్ ప్రొడ్యూసర్ ఈ వీడియోను క్యాచీ క్లిప్స్తో రీమిక్స్ చేయడంతో భారత్ కూడా ఈ పార్టీలో జాయిన్ అయింది.
ఆ తర్వాత ఇది భారత్లో కూడా వైరల్గా మారింది. బాలీవుడ్ స్టార్ల దగ్గర నుంచి సైనికుల వరకు తమ సొంత వెర్షన్లో ఈ వీడియోను మలుచుకున్నారు.
దీనిపై ఇంటర్నెట్లో మీమ్స్ కూడా పుట్టుకొచ్చాయి.
దక్షిణాఫ్రికాతో సిరీస్ గెలుపొందాక పాకిస్తాన్ క్రికెటర్లు తమ వెర్షన్లో ఈ వీడియో చేయడాన్ని పాకిస్తాన్ జాతీయ క్రికెట్ బోర్డు షేర్ చేసింది.
''దశాబ్ధాలుగా కొనసాగుతోన్న శత్రుత్వం కారణంగా చాలా విషయాలపై సాధారణంగా విభేదించే రెండు దేశాల ప్రజలను ఈ వీడియో ఉత్సాహపరిచిందని'' బీబీసీ పేర్కొంది.
దీనిపై మోబీన్ కూడా హర్షం వ్యక్తం చేశారు.
''ప్రపంచవ్యాప్తంగా చాలా ఇబ్బందులు, చాలా అంతరాలు ఉన్న సమయంలో సరిహద్దుల్లో ప్రేమను పంచుకోవడం కంటే మెరుగైనది ఏముంటుంది'' అని బీబీసీ ఉర్దూతో అన్నారు.
3. భారత్ తొలి కోవిడ్ టీకా
భారత్ జనవరిలో ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు మొట్టమొదటగా పారిశుద్ధ్య కార్మికుడు తొలి టీకాను తీసుకున్నారు.
https://twitter.com/ANI/status/1350320237212704770
ఢిల్లీలోని ఎయిమ్స్లో పనిచేసే 34 ఏళ్ల మనీశ్ కుమార్ తొలుత టీకాను తీసుకున్నారు.
''అది చాలా మంచి అనుభవం. టీకా తీసుకునేందుకు నేను వెనుకాడలేదు. టీకా గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు'' అని ఏఎన్ఐ వార్తా సంస్థతో మనీశ్ అన్నారు.
టీకా కార్యక్రమంలో ఫ్రంట్ లైన్ కార్మికులే తమ తొలి ప్రాధాన్యత అని చెప్పడానికే పారిశుధ్య కార్మికుడైన మనీశ్ను ఎంపిక చేసినట్లు దీనిద్వారా తెలుస్తోంది.
పారిశుధ్య కార్మికులు తరచుగా భయంకరమైన, అపరిశుభ్రమైన పరిస్థితుల్లో ఎక్కువ రక్షణ పరికరాలు లేకుండానే పని చేస్తారు.
ఆరోజు జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ... తన ప్రసంగంలో డాక్టర్లు, నర్సులు, ఇతర ఫ్రంట్లైన్ వర్కర్ల సేవల గురించి సుదీర్ఘంగా మాట్లాడారు.
4. ఒలింపిక్స్లో భారత్కు తొలి అథ్లెటిక్స్ స్వర్ణం
ఆగస్టులో జరిగిన ఒలింపిక్స్ జావెలిన్ త్రో పురుషుల సింగిల్స్ విభాగంలో భారత అథ్లెట్ నీరజ్ చోప్రా జావెలిన్ను 87.58 మీటర్ల దూరం విసిరి భారత్కు తొలి అథ్లెటిక్స్ స్వర్ణాన్ని అందించారు.
ఈ చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకొని భారతీయులంతా గర్వంగా సంబరాలు చేసుకున్నారు.
2008లో అభినవ్ బింద్రా స్వర్ణాన్ని గెలుచుకున్న తర్వాత మళ్లీ ఒలింపిక్స్లో వ్యక్తిగత విభాగంలో స్వర్ణం గెలిచిన రెండో భారతీయుడిగా నీరజ్ చోప్రా ఘనత వహించారు.
పోటీలో భాగంగా అత్యుత్తమ రీతిలో ఈటెను విసిరిన నీరజ్ చోప్రా, అది ఎక్కడ పడిందో కూడా చూసుకోకుండా విజయోత్సాహంతో చేతులు పైకెత్తుతూ సంబరాలు చేసుకునే వీడియో వైరల్గా మారింది.
https://twitter.com/OlympicKhel/status/1423983726980001798
''నాకు నమ్మశక్యంగా అనిపించలేదు. అది నాకు, నా దేశానికి గర్వకారణమైన క్షణం'' అని నీరజ్ వ్యాఖ్యనించారు.
ఈ విజయంతో నీరజ్ చోప్రా భారత్లో హీరో అయ్యాడు. స్వర్ణం సాధించిన ఆయనకు భారత్లో ఘన స్వాగతం లభించింది.
5. రస్పుటిన్ చాలెంజ్
ఏప్రిల్ నెలలో కేరళకు చెందిన ఇద్దరు వైద్య విద్యార్థులు, 1978 నాటి డిస్కో హిట్ సాంగ్ అయిన 'రస్పుటిన్'కు హుషారుగా డ్యాన్స్ చేశారు
జానకీ ఓం కుమార్, నవిన్ రజాక్ అనే ఇద్దరు విద్యార్థులు కాలేజీలో చేసిన 30 సెకన్ల డ్యాన్స్ వీడియో ఇన్స్టాగ్రామ్ రీల్ కేటగిరీలో వైరల్గా మారింది. దీన్ని మిలియన్ల సంఖ్యలో ప్రజలు చూశారు.
వీరిద్దరూ ఆత్మవిశ్వాసంతో చేసిన డ్యాన్స్తో పాటు వీడియో చివర్లో రజాక్ కనుబొమ్మలతో చేసే మూమెంట్ను కూడా ప్రేక్షకులు విపరీతంగా ఆదరించారు.
అయితే వీరిద్దరూ భిన్న మతాలకు చెందిన వారు కావడం వల్ల వీరిద్దరూ ఫేస్బుక్లో కొంత విద్వేషాన్ని కూడా ఎదుర్కొన్నారు. జానకి హిందువు కాగా, నవిన్ రజాక్ ముస్లిం. ఈ నేపథ్యంలో జానకి గురించి జాగ్రత్తగా ఉండాలంటూ ఆమె తల్లిదండ్రులకు ఒక పోస్ట్ ద్వారా హెచ్చరికలు కూడా జారీ చేశారు.
రెండు మతాలకు చెందిన వారు స్నేహితులు అయితే వారు, తమ కుటుంబ సభ్యులు, మత సంఘాల నుంచి ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రేమలో పడేసి హిందు అమ్మాయిలను ఇస్లాంలోకి మార్చాలనే ఏకైక ఉద్దేశ్యంతోనే ముస్లిం పురుషులు స్నేహం చేస్తారని హిందూ మితవాద సమూహాలు ఆరోపిస్తున్నాయి.
కానీ జానకీ, రజాక్లకు విద్యార్థి సంఘాల నుంచి చాలా మద్దతు లభించింది. చాలా మంది వైద్య విద్యార్థులు వీరి డ్యాన్స్ వీడియోను తమ సామాజిక మాధ్యమ ఖాతాల్లో షేర్ చేశారు.
https://www.facebook.com/watch/?v=489817285709051
ఇదే పాటకు మరో వెర్షన్లో జానకీ ఓం కుమార్, రజాక్ మిత్రులు కలిసి డ్యాన్స్ చేశారు. డ్యాన్స్ ముగుస్తుండగా వీరిద్దరూ కూడా మిత్ర బృందంతో చేరి డ్యాన్స్ చేశారు. ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ ' మీరు ద్వేషాన్ని వ్యాప్తి చేయాలని అనుకుంటే మేం దాన్ని ప్రతిఘటించేందుకు ప్లాన్ చేస్తాం' అనే వ్యాఖ్యను జోడించారు.
కాలేజీ హళ్లు, డ్యాన్స్ ఫ్లోర్లుగా మారిపోయాయి. విద్యార్థులంతా తమ సొంత వీడియోలను షేర్ చేస్తూ #stepagainsthatred అనే హ్యాష్ట్యాగ్ను ట్రెండ్ చేశారు.
ఇవి కూడా చదవండి:
- హైదరాబాద్ నగరం 'రాత్రి ఆకాశాన్ని ఎలా మిస్సవుతోంది, కాంతి కాలుష్యం అంటే ఏమిటి? - 11 ప్రశ్నలు, జవాబులు
- జనవరి 1 నుంచి ఏమేం మారతాయి... మీరేం చేయగలరు, ఏం చేయలేరు?
- ఆస్కార్ రేసులో ఆశలు రేపుతున్న 15 సినిమాలివే...
- గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాళీచరణ్ మహరాజ్ ఎవరు, ఆయన గతంలో ఏం చేసేవారు
- కోవిడ్ మహమ్మారి: 2021లో నేర్చుకున్న గుణపాఠాలేంటి, మున్ముందు ఏం చేయాలి ?
- ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొత్త కారు ధర ఎంత? రూ.12 కోట్లు కాదంటున్న అధికారులు
- మనిషి, మొసళ్ల మధ్య మనుగడ పోరాటం
- కొంపముంచిన అలెక్సా, పదేళ్ల చిన్నారికి ప్రమాదకరమైన చాలెంజ్
- గోవాలో క్రిస్టియానో రొనాల్డో విగ్రహ ఏర్పాటుపై వివాదం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)