కావరం: ఇద్దర్ని చంపేసి మా డాడీ డబ్బులిస్తాడని... (వీడియో)
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో అమానుషమైన సంఘటన చోటు చేసుకుంది. పీకల దాకా తాగేసి కారు నడిపి అడ్డు వచ్చినవారందరినీ గుద్దుకుంటూ వెళ్లిపోయాడు ఓ యువకుడు. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా, మరొకర తీవ్రంగా గాయపడ్డారు.
అతి కష్టం మీద ఓ పోలీసు కారు ఆపగలిగాడు. చనిపోయిన వారికి మా డాడీ డబ్బులిస్తాడు, తీసుకోండని పొగరుబోతు సమాధానం ఇచ్చాడు. డబ్బు మదంతో కళ్లు నెత్తికెక్కిన ఢిల్లీలోని ఓ 21 ఏళ్ల యువకుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. సోమవారం తెల్లవారుఝామున ఈ సంఘటన జరిగింది. రాత్రంతా స్నేహితుని ఇంట్లో పార్టీ అంటూ పీకలదాకా తాగిన రిషబ్ రావత్ అనే ఆ యువకుడు తన హోండా సిటీ కారుతో మారణకాండ సాగించాడు.
జనక్పురిలో నివాసం ఉండే రిషబ్.. పక్కనే మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న శివ్నగర్లోని తన స్నేహితుని ఇంట్లో పార్టీ చేసుకున్నాడు. అక్కడ నుంచి కేవలం ఐదు నిమిషాల ప్రయాణం. కానీ ఆ కాసేపట్లోనే తాగిన మైకంలో ఇద్దరిని పొట్టనబెట్టుకున్నాడు. ఇష్టం వచ్చినట్లుగా నడుపుతూ ఓ వ్యక్తి తన కారు అద్దంపై పడి అది పగిలినా ఏం చేస్తున్నాడో తెలియకుండా అలాగే ముందుకెళ్లిపోయాడు.
కొద్ది దూరం తర్వాత మరో వ్యక్తి ఢీకొడితే అతడు పక్కనే ఉన్న గోడకు బలంగా ఢీకొని అక్కడికక్కడే మరణించాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఇదంతా చూసిన ఓ కానిస్టేబుల్ కొద్ది దూరం వెళ్లిన తర్వాత తన బైక్తో ఎలాగోలా కారును ఓవర్టేక్ చేసి ఆపగలిగాడు. కారులో నుంచి దిగిన రిషబ్ కానిస్టేబుల్ను సిగరెట్ లైటర్ అడిగి చనిపోయిన వారికి మా డాడీ డబ్బులిస్తాడంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు.
అతన్ని అరెస్ట్ చేసి జనక్పురి పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు.. ఐపీసీ సెక్షన్ 304, 308 కింద కేసులు నమోదు చేశారు. హార్డ్వేర్ షాపు నడుపుకునే అతని తండ్రికి సమాచారమిచ్చారు. అతని రక్తంలో ఆల్కాహాల్ స్థాయి 159 ఎంజీసీసీగా గుర్తించారు. ఇది సాధారణ స్థాయి 30 ఎంజీసీసీగా ఉండాలి. ప్రమాదంలో మరణించిన ఆనంద్, ప్రసాద్ల మృతదేహాలను పోలీసులు వాళ్ల కుటుంబసభ్యులకు అప్పగించారు.