జమ్మూ కాశ్మీర్ లో 21వ రోజుకు చేరిన టెర్రరిస్ట్ సెర్చ్ ఆపరేషన్; ల్యాండ్ మైన్ పేలుడులో ఇద్దరు జవాన్లు మృతి !!
జమ్మూకాశ్మీర్లో ఉద్రిక్తతలు చల్లారడం లేదా? ఉగ్రవాదుల చొరబాటు యత్నాలు, జమ్మూ కాశ్మీర్లో శాంతిభద్రతలు విఘాతం కలిగించడం కోసం, విధ్వంసం సృష్టించడం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఇంకా కొనసాగుతున్నాయా? చాప కింద నీరులా జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదం విస్తరిస్తోందా? భారత భద్రతా బలగాలకు టెర్రరిస్టులు రోజుకో కొత్త సవాలును విసురుతున్నా రా ? అంటే అవుననే సమాధానమే వస్తోంది.
జమ్మూ కాశ్మీర్ లో ఆర్మీకి, ఉగ్రవాదులకు మధ్య ప్రచ్చన్న యుద్ధం
జమ్మూకాశ్మీర్ ఎన్ కౌంటర్ లతో అట్టుడుకుతోంది. ఆర్మీ , టెర్రరిస్ట్ ల మధ్య భీకర పోరాటం కొనసాగుతుంది. ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. ఉగ్రవాదుల చొరబాట్లను అడ్డుకోవటం ఆర్మీకి పెను సవాల్ గా మారింది. నిత్యం జమ్మూ కాశ్మీర్ తుపాకీ శబ్దాలతో భయోత్పాతాన్ని సృష్టిస్తుంది. తాజాగా జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ సెక్టార్లో ఉగ్రవాద చొరబాట్లను అడ్డుకోవటానికి భారత భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ సాగిస్తున్నారు. ఇందులో ఇప్పటికే పలువురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు.ఇదే సమయంలో నౌషేరా సెక్టార్ లోనూ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది.
ఉగ్రమూకను ఏరివేయటం భారత్ కు పెద్ద చాలెంజ్
భారత దేశానికి ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ ను కాపాడడం పెద్ద సవాల్ గా మారింది. ఒకపక్క డ్రోన్లతో దాడులు చేస్తూ, మరోవైపు లైన్ ఆఫ్ యాచ్యువల్ కంట్రోల్ నుండి చొరపాట్లకు ప్రయత్నిస్తూ జమ్మూకాశ్మీర్లో విధ్వంసం సృష్టించడానికి ఉగ్రవాదులు నిత్యం ప్రయత్నాలు చేస్తున్న ఉగ్రమూకను ఏరివేయటం భారత్ కు పెద్ద చాలెంజ్ గా మారింది . పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రమూక భూగర్భ సొరంగాల ద్వారా భారత భూభాగంలోకి చొచ్చుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా భారత్లో ఉన్న స్లీపర్ సెల్స్ ద్వారా కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఉగ్రవాద అనుబంధ సంస్థలను ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రేరేపిస్తూ జమ్మూకాశ్మీర్లో జనజీవనాన్ని ఇబ్బంది పెడుతున్నారు.
జమ్ము కాశ్మీర్ పరిరక్షణ కోసం ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్
జమ్ము కాశ్మీర్లో సామాన్య పౌరులను మట్టు పెడుతున్నారు. ఈ క్రమంలో భారత ఆర్మీ జమ్ము కాశ్మీర్ పరిరక్షణ కోసం ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ ను మొదలుపెట్టింది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రంగంలోకి దిగి ఉగ్రవాద అనుబంధ సంస్థలను గుర్తిస్తూ అండర్ గ్రౌండ్ వర్కర్స్ గా పనిచేస్తున్న ఉగ్రవాదులను అరెస్టు చేస్తుంది. జమ్ము కాశ్మీర్ లో సుదీర్ఘ ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఈ ఆపరేషన్లో ఇప్పటికే అనేక మంది టెర్రరిస్టులు హతం కాగా, పలువురు భారత జవాన్లు సైతం వీర మరణం పొందారు.
నౌషేరా-సుందర్బానీ సెక్టార్లో మందుపాతర పేలుడు , ఇద్దరు ఆర్మీ జవాన్లు మృతి
తాజాగా జమ్మూ కాశ్మీర్లోని నౌషేరా-సుందర్బానీ సెక్టార్లోని నియంత్రణ రేఖ వద్ద జరిగిన మందుపాతర పేలుడులో ఇద్దరు సైనికులు మరణించారు. మరో ముగ్గురు గాయపడినట్లు శనివారం భద్రతా వర్గాలు తెలిపాయి. ఆర్మీ పెట్రోలింగ్ నియంత్రణ రేఖ సమీపంలో ల్యాండ్మైన్ పేలుడు సంభవించి ఒక అధికారి మరియు సైనికుడు మరణించినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిని ఆర్మీ ఆసుపత్రికి తరలించగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
నౌషేరా సెక్టార్లో ఏరియా డామినేషన్ పెట్రోలింగ్ సమయంలో, మందుపాతర పేలుడు సంభవించింది. ఇందులో ఇద్దరు భారత ఆర్మీ జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు, తరువాత వారు గాయాలతో మరణించారు. గాయపడిన మరో ముగ్గురు సైనికులు ఆసుపత్రికి తరలించ బడ్డారు. ప్రస్తుతం వారంతా చికిత్సలో ఉన్నారు అని జమ్మూ ప్రాంతంలోని రక్షణ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.
లెఫ్టినెంట్ రిషి కుమార్ , సిపాయి మంజిత్ మృతి
మరణించిన లెఫ్టినెంట్ రిషి కుమార్ మరియు సిపాయి మంజిత్ ధైర్యవంతులు మరియు సైనిక వృత్తి పట్ల చాలా నిబద్ధత కలిగి ఉన్నారని , క్రియాశీల విధి నిర్వహణలో దేశం కోసం అత్యున్నత త్యాగం చేశారని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.. లెఫ్టినెంట్ రిషి కుమార్ బీహార్లోని బెగుసరాయ్ నివాసి. సిపాయి మంజిత్ సింగ్ సిర్వేవాలా, భటిండా, పంజాబ్ నివాసి. వారి అత్యున్నత త్యాగం కోసం దేశం మరియు భారత సైన్యం ఎప్పటికీ వారి ధైర్య హృదయాలకు రుణపడి ఉంటాయి" అని ఆర్మీ ప్రతినిధి చెప్పారు.
మూడు వారాలుగా కొనసాగుతున్న ఆర్మీ ఆపరేషన్ ..
నౌషేరా సెక్టార్ జమ్మూలోని పిర్పంజల్ ప్రాంతంలో భాగమైన రాజౌరి జిల్లా పరిధిలోకి వస్తుంది, ఇక్కడ గత మూడు వారాలుగా ఆర్మీ ఆపరేషన్ జరుగుతోంది.పూంచ్ అడవుల్లో దాగి ఉన్నారని భావిస్తున్న ఉగ్రవాదులను మట్టుబెట్టడం కోసం కొనసాగించిన ఆపరేషన్లో ఇద్దరు అధికారులతో సహా తొమ్మిది మంది సైనికులు మరణించారు. ఇప్పుడు నౌషారా సెక్టార్ లో మరో ఇద్దరు భారత జవాన్లు వీర మరణం పొందారు.గత 18 ఏళ్లలో ఇంత సుదీర్ఘమైన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ ఎప్పుడూ ఈ ప్రాంతాల్లో జరగలేదు.
ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ కు 21వ రోజు
జమ్మూ కాశ్మీర్లోని జంట సరిహద్దు జిల్లాలు పూంచ్ మరియు రాజౌరి అటవీ ప్రాంతంలో దాగి ఉన్న ఉగ్రవాదుల గుంపును గుర్తించేందుకు చేపట్టిన ఆపరేషన్ 21వ రోజుకు చేరుకుంది.మెంధార్లోని భట్టి దుర్రియన్తో పాటు పూంచ్ జిల్లాలోని సురన్కోట్ అటవీప్రాంతం, రాజౌరీలోని థానమండి సమీపంలోని ఈ ఆపరేషన్ అక్టోబర్ 11న ప్రారంభమైందని వారు తెలిపారు. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో ఉగ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్న క్రమంలో, పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత దేశంలోకి చొరబడి ఉన్న సమయంలో జరుగుతున్న అతి సుదీర్ఘమైన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ జరుగుతుంది.
ఈ ఆపరేషన్లో ఎంతో మంది భారత జవాన్లు దేశం కోసం తన ప్రాణాలను త్యాగం చేస్తున్నారు. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో ఉగ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్న క్రమంలో, పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత దేశంలోకి చొరబడి ఉన్న సమయంలో జరుగుతున్న అతి సుదీర్ఘమైన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ జరుగుతుంది. ఈ ఆపరేషన్లో ఎంతో మంది భారత జవాన్లు దేశం కోసం తన ప్రాణాలను త్యాగం చేస్తున్నారు.