23 మంది అభ్యర్థులతో కర్ణాటక బీజేపీ రెండో జాబితా: జగదీశ్ షెట్టర్కు షాక్
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. తాజాగా, 23 మంది అభ్యర్థులతో బీజేపీ తన రెండో జాబితాను విడుదల చేసింది. మరో 12 స్థానాలకు భ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అయితే, రెండో జాబితాలో పలువురు సీనియర్ నేతలకు టికెట్ రాకపోవడం చర్చనీయాంశంగా మారింది.
224 స్థానాలు కలిగిన కర్ణాటక అసెంబ్లీకి ఇప్పటి వరకు బీజేపీ 189 మంది అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ రెండో జాబితాలో హుబ్బళ్లి-ధర్వాడ్ సెంట్రల్ సీట్ నుంచి ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ షెట్టర్కు స్థానం దక్కకపోవడం గమనార్హం. అయితే, తనకు టికెట్ కేటాయించకపోతే తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని తేల్చి చెప్పారు.

బీజేపీ తాజాగా ప్రకటించిన 23 మంది అభ్యర్థుల జాబితాలో ఇద్దరు మహిళలకు చోటు కల్పించారు. రెండు జాబితాల్లోనే మొత్తం అభ్యర్థులను ప్రకటిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై బుధవారం చెప్పినప్పటికీ.. ఇప్పుడు మూడో జాబితా కూడా విడుదల చేయాల్సిన అవసరం ఏర్పడింది.
హుబ్బళ్లి నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న జగదీశ్ షెట్టర్కు చివరి జాబితాలోనైనా అవకాశం దక్కుతుందని అంచనా వేస్తున్నారు. మాజీ సీఎం యడ్యూరప్ప కూడా షెట్టర్కు 99 శాతం టికెట్ వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. జేడీఎస్ నుంచి పలువురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడంతో టికెట్ల కేటాయింపు ఆ పార్టీకి సమస్యగా మారింది.
రెండో జాబితాలో పలువురు బీజేపీ సీనియర్ నేతలకు కూడా టికెటక్ దక్కలేదు. వీరిలో కలఘటగి నుంచి సీఎం నిమ్మన్నవర్, ముదిగెరెలో ఎంపీ కుమారస్వామి, హావేరిలో నెహరు ఓలేకరు, చన్నగిరిలో మాదాల్ విరూపాక్షప్ప ఉన్నారు. అయితే, విరూపాక్షప్ప అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.












Click it and Unblock the Notifications