మత్తు మందిచ్చి యువతిపై రేప్: వీడియో తీసి బెదిరింపులు
వడోదరా: ఓ 24ఏళ్ల యువతిపై అత్యాచారం జరిగింది. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని వడోదరాలో చోటు చేసుకుంది. బాధిత యువతి ఆదివారం పోలీసులను ఆశ్రయించి, ఫిర్యాదు చేసింది. సూరత్కు చెందిన అవదేశ్ వ్యాస్ అనే వ్యక్తి తనపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపింది. గత డిసెంబర్ 19న తనపై ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడని ఫిర్యాదులో పేర్కొంది.
తన బంధువుల ద్వారా అవదేశ్ తనకు పరిచయమయ్యాడని రాజస్థాన్కు చెందిన బాధిత యువతి తెలిపింది. ఆ తర్వాత తనతో ఫోన్లో తరచూ మాట్లాడుతుండేవాడని, సందేశాలు పంపుతుండేవాడని చెప్పింది. అంతేగాక, అతడ్ని కలవాలని ఒత్తిడి చేశాడని, కలవకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు గురి చేశాడని పేర్కొంది.
దీంతో తాను డిసెంబర్ 19న అవదేశ్ నివాసానికి వెళ్లినట్లు యువతి తెలిపింది. ఆ తర్వాత తనను వివాహం చేసుకుంటానని చెప్పిన అవదేశ్.. తనకు మత్తు మందు కలిపిన ఆహారాన్ని అందించాడని చెప్పింది. తనకు విషయం తెలియక ఆ ఆహారాన్ని తీసుకున్నట్లు తెలిపింది. ఆ తర్వాత తాను స్పహ కోల్పోయినట్లు చెప్పింది.
ఆ తర్వాత తనపై అవదేశ్ అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులకు తెలిపింది. అంతేగాక, తనను ఐదురోజులపాటు బంధించాడని తెలిపింది. తనపై పాల్పడిన అఘాయిత్యాన్ని వీడియో తీసి తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని చెప్పింది. దీంతో అతని వేధింపులు భరించలేక పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.