మృత్యు ఘంటికలు.. 24 గంటల్లో ఒకే ఆస్పత్రిలో 25 మంది మృతి... ఆక్సిజన్ కొరతతో ఢిల్లీ ఆస్పత్రుల విలవిల...
ఢిల్లీ ఆస్పత్రుల్లో మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో మొత్తం 306 మంది కరోనాతో చనిపోయారు. ఇందులో ఒక్క సర్ గంగరాం ఆస్పత్రిలోనే 25 మంది కరోనాతో మృతి చెందారు. ఆక్సిజన్ అందకపోవడమే వీరి మరణాలకు కారణమన్న ప్రచారం జరుగుతోంది. ఆస్పత్రి యాజమాన్యం చేసిన ట్వీట్ కూడా ఇందుకు ఊతమిస్తోంది. 'గడిచిన 24 గంటల్లో పరిస్థితి విషమించిన 25 మంది పేషెంట్లు మృతి చెందారు. ఆస్పత్రిలో ఉన్న ఆక్సిజన్ మరో 2 గంటల్లో అయిపోతుంది. అదే జరిగితే మరో 60 మంది పేషెంట్ల ప్రాణాలు ప్రమాదంలో పడతాయి...' అని ఆస్పత్రి యాజమాన్యం పేర్కొనడం గమనార్హం.
గంగారాం ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత...
ఆస్పత్రిలో ఉన్న వెంటిలేటర్లు కూడా అంతగా పనిచేయట్లేదని... అత్యవసరంగా ఆక్సిజన్ సరఫరా చేయాలని గంగారాం ఆస్పత్రి యాజమాన్యం కోరింది. ఆస్పత్రి ఛైర్మన్ డీఎస్ రానా మాట్లాడుతూ.. '24గంటల వ్యవధిలోనే 25 మంది పేషెంట్లు చనిపోవడం ఇదే తొలిసారి. అయితే నేను దీన్ని ఆక్సిజన్ కొరతతో ముడిపెట్టి చూడట్లేదు. ప్రస్తుతం చాలామంది పేషెంట్లు ఇంకా విషమ పరిస్థితుల్లోనే ఉన్నారు. ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత ఉంది..' అని పేర్కొన్నారు.

3 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సప్లై...
గంగారాం ఆస్పత్రి విజ్ఞప్తిపై స్పందించిన ప్రభుత్వం వెంటనే 3 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను ట్యాంకర్ల ద్వారా అక్కడికి తరలించింది. ప్రస్తుతం ఆ ట్యాంకర్ల కోసం ఎదురుచూస్తున్నట్లు డీఎస్ రానా తెలిపారు. అయితే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సకాలంలో,ఎటువంటి అడ్డంకులు లేకుండా ఆక్సిజన్ సరఫరా చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గురువారం(ఏప్రిల్ 22) రాత్రి 8గంటల సమయానికి ఆస్పత్రిలో ఉన్న ఆక్సిజన్ మరో నాలుగైదు గంటలు మాత్రమే వచ్చే పరిస్థితి ఉన్నట్లు గుర్తించామన్నారు. వెంటనే ఆక్సిజన్ కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామన్నారు. ప్రస్తుతం గంగారాం ఆస్పత్రిలో 510 మంది కరోనా పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. వీరిలో 142 మందికి హైఫ్లో ఆక్సిజన్ సపోర్ట్పై చికిత్స అందిస్తున్నారు.

మ్యాక్స్ ఆస్పత్రిది అదే పరిస్థితి...
ఢిల్లీలోని మ్యాక్స్ ఆస్పత్రిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఆస్పత్రిలో ఉన్న ఆక్సిజన్ మరో గంట మాత్రమే వస్తుందని... ఆక్సిజన్ అయిపోతే 700 మంది ప్రాణాలు రిస్క్లో పడుతాయని ఆస్పత్రి యాజమాన్యం గురువారం ఉదయం ప్రభుత్వానికి తెలిపింది. అంతేకాదు,ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత కారణంగా కొత్త పేషెంట్లను చేర్చుకోవట్లేదని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. కానీ ఆ తర్వాత కొద్దిసేపటికే ఆ ట్వీట్ను డిలీట్ చేసింది. మ్యాక్స్ ఆస్పత్రికి ఆక్సిజన్ ట్యాంకర్లను పంపించినట్లు తాజాగా సౌత్ ఢిల్లీ డీసీపీ తెలిపారు.

కేంద్రంపై హైకోర్టు ఆగ్రహం...
ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆస్పత్రులకు ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలని హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై న్యాయస్థానం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ఇంత నిర్లక్ష్యమేంటని ప్రశ్నించింది. ఓవైపు దేశంలో ఆక్సిజన్ కొరత కారణంగా కోవిడ్ పేషెంట్ల మరణాలు పెరుగుతుంటే.. కేంద్రప్రభుత్వం ఏం చేస్తున్నట్లు... మీకు బాధ్యత లేదా... టాటా లాంటి కంపెనీలు మానవతా దృక్పథంతో తమ ప్లాంట్స్లో ఉత్పత్తి చేస్తున్న ఆక్సిజన్ను మెడికల్ అవసరాలకు ఇస్తున్నారు.. ఇదే పని ఇతరులు ఎందుకు చేయట్లేదు... మీరు ఆదేశాలిస్తే ఏ ఇండస్ట్రీ నో చెప్పదు. కేంద్రం ఆధీనంలో పనిచేస్తున్న పెట్రోలియం కంపెనీలు ఉండనే ఉన్నాయి... అయినప్పటికీ ఎందుకింత నిర్లక్ష్యం... అంటూ ఢిల్లీ హైకోర్టు కేంద్రంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.












Click it and Unblock the Notifications