25 మందిని కాటికి పంపిన కల్తీ మద్యం
ముంబై: కల్తీ మద్యం సేవించి 25 మంది మృతి చెందిన సంఘటన ముంబై నగరంలో జరిగింది. కల్తీ మద్యం సేవించిన పలువురు వివిధ ఆసుపత్రులలో మృత్యువుతో పోరాడుతున్నారు. వారిలో చాల మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు.
ముంబై నగర పోలీసు అధికారి ధనంజయ్ కులకర్ణి తెలిపిన వివరాల ప్రకారం - సబర్బన్ మలాద్ లోని లక్ష్మి నగర్ మురికి వాడలలో (స్లం) గురువారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో పలువురు మద్యం సేవించారు. మద్యం సేవించిన తరువాత అందరూ వాంతులు, విరేచనాలు చేసుకున్నారు.
వారిని ఆసుపత్రలకు తరలిస్తున్న సమయంలో మార్గం మధ్యలోనే కొందరి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఆసుప్రతులలో పలువురు మరణించారు. విషయం తెలుసుకున్న ముంబై నగర కార్పొరేషన్ అధికారులు, నాయకులు ఆసుపత్రుల దగ్గరకు పరుగు తీశారు.
భారీ వర్షాల కారణంగా చాల మందిని సరైన సమయంలో ఆసుపత్రులకు తీసుకు వెళ్లలేకపోవడంతో కొందరు మరణించారు. ముంబై నగరంలోని ప్రైం ఆసుపత్రి, శతాబ్ధి ఆసుపత్రి, బీఎంసీ ఆసుపత్రి, సిద్దార్థ ఆసుపత్రులలో బాధితులు చికిత్స పోందుతున్నారని పోలీసు అధికారి ధనంజయ్ కులకర్ణి అన్నారు.
విషయం తెలుసుకున్న ముంబై నగర పోలీసు కమిషనర్ రాకేష్ మారియా కేసు దర్యాప్తు చెయ్యాలని ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. కల్తీ మద్యం విక్రయించిన వారు పరారైనారు. 2004లో ముంబై నగరంలోని సబర్బన్ ప్రాంతంలో కల్తీ మద్యం సేవించి 87 మంది కార్మికులు మృత్యువాత పడ్డారు. రాజు లంగ్డా అనే వ్యక్తి కల్తీ మద్యం విక్రయించాడని పోలీసులు గుర్తించారు.