ప్రియురాలి కోసం తల్లిదండ్రులు, సోదరిని హతమార్చాడు: రాత్రంతా..
ప్రియురాలి కోసం కనిపెంచిన తల్లిదండ్రులను, తోడబుట్టిన సోదరిని దారుణ హత్య చేశాడు ఓ దుర్మార్గుడు. ఈ దారుణ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.
చెన్నై: ప్రియురాలి కోసం కనిపెంచిన తల్లిదండ్రులను, తోడబుట్టిన సోదరిని దారుణ హత్య చేశాడు ఓ దుర్మార్గుడు. ఈ దారుణ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
తిరుపత్తూరులో సమీపంలోని కాక్కంగరైలో విద్యుత్తు సంస్థ ఉద్యోగి మోహన్, ఆయన భార్య రాజేశ్వరి, వారి కుమార్తె సుకన్య సోమవారం ఉదయం దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే. మోహన్ కుమారుడు తమిళరసన్ గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసులో తమిళరసనే నిందితుడని పోలీసులు భావిస్తున్నారు. విచారణలో తమిళరసన్ పలు అంశాలు చెప్పినట్లు తెలుస్తోంది.
విశ్వసనీయ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.... హోసూర్లో తమిళరసన్ పనిచేస్తున్న సమయంలో సహోద్యోగినిని ప్రేమించాడు. ఆమె కోసం కుటుంబసభ్యులకు తెలియకుండా రూ. లక్షలు ఖర్చుచేశాడు. మరో రూ. 2 లక్షలు అవసరమని ఆమె అడిగింది. దీంతో ఆ మొత్తం ఇవ్వాలని తన తల్లిదండ్రులను తమిళరసన్ కోరాడు.
ఆ యువతి విషయం తెలిసిన సుకన్య సదరు వివరాలను తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో తమిళరసన్కు డబ్బులు ఇవ్వలేదు. ఆగ్రహంతో బయటకు వెళ్లిన తమిళరసన్ ఆదివారం రాత్రి మద్యం తాగి ఇంటికి తిరిగొచ్చాడు. అప్పుడు తల్లితో వాగ్వివాదానికి దిగాడు. దీనికంతటికీ కారణం సుకన్య కావడంతో కత్తితో ఆమెపై దాడి చేశాడు. అడ్డుకున్న తల్లిని కూడా గొంతు కోసి హతమార్చాడు. ఇద్దరి మృతదేహాల వద్దే రాత్రంతా గడిపాడు.
ఆదివారం రాత్రి విధులకు వెళ్లిన మోహన్... సోమవారం ఉదయం ఇంటికి వచ్చాడు. భార్య, కుమార్తె రక్తపు మడుగులో విగత జీవులుగా పడి ఉండటం చూసి బోరున విలపించాడు. పోలీసులకు తనను అప్పగిస్తాడనే భయంతో తమిళరసన్ ఆయన తలపై బండరాయి వేసి, కత్తితో గొంతు కోసి చంపాడు. ఆ సమయంలో మోహన్ అరుపులు విన్న ఇరుగుపొరుగు వచ్చేలోపు తమిళరసన్ కత్తితో గాయపరచుకుని స్పృహ కోల్పోయినట్లు నటించాడు.
స్థానికుల సమాచారంతో పోలీసులు వచ్చి తమిళరసన్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఒక వ్యక్తి ముఖానికి ముసుగు ధరించి తమపై దాడి చేసినట్టు తమిళరసన్ తొలుత విచారణలో తెలిపాడు. పలు ప్రశ్నలకు అతడిచ్చిన సమాధానాలతో పొంతన కుదరకపోవడంతో పోలీసులకు తమిళరసన్పై అనుమానం వచ్చింది. గట్టిగా ప్రశ్నించడంతో ముగ్గుర్ని తానే హత్య చేసినట్టు ఒప్పుకున్నాడని సమాచారం.