బాబ్రీ కూల్చివేతకు రజతోత్సవం: రాష్ట్రపతిగా అద్వానీ?
మోడీ తన రాజకీయ గురువుగా భావిస్తున్న ఎల్ కే అద్వానీకి గురు దక్షిణగా ఆయనను రాష్ట్రపతిగా ఎన్నిక చేస్తారా? లేదా? అన్న విషయమై దీనిపై అధికార పక్ష వర్గాల్లో విస్త్రుత స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి.
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చారిత్రక విజయం తర్వాత దేశ తదుపరి రాష్ట్రపతి ఎన్నికపై చర్చ మళ్లింది. ప్రధాని నరేంద్రమోడీ తన రాజకీయ గురువుగా భావిస్తున్న ఎల్ కే అద్వానీకి గురు దక్షిణగా ఆయనను రాష్ట్రపతిగా ఎన్నిక చేస్తారా? లేదా? అన్న విషయమై దీనిపై అధికార పక్ష వర్గాల్లో విస్త్రుత స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి.
వచ్చే జూలై 25వ తేదీన రాష్ట్రపతి ఎన్నిక జరుగనుండగా అధికార పక్ష వర్గాల్లో తదుపరి రాష్ట్రపతి ఎవరన్న అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. ఈ నెల 11వ తేదీన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత గుజరాత్ రాష్ట్రంలోని సోమనాథ్ దేవాలయాన్ని ప్రధాని నరేంద్రమోడీ సందర్శించినప్పుడు చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుతున్నాయి.
ఈ నెల 15న ప్రధాని మోదీతోపాటు, ఎల్ కే అద్వానీ కూడా సోమనాథ్ దేవాలయ ట్రస్టీ సభ్యుడిగా హాజరైన ఒక సమావేశంలో మోదీ చేసిన వ్యాఖ్యలు నిదర్శనంగా ఉన్నాయి. నాటి సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, గుజరాత్ మాజీ సీఎం కేశూభాయి పటేల్ కూడా హాజరయ్యారు.
తదుపరి రాష్ట్రపతిగా ఎల్ కే అద్వానీ పేరును ఈ సమావేశంలో ప్రధాని మోదీ ప్రతిపాదించినట్లు వార్తలొచ్చాయి. భారత రాష్ట్రపతి పదవికి ఎల్ కే అద్వానీకి అప్పగించడమే తనకు సరైన గురు దక్షిణ అని భావిస్తున్నట్లు మోదీ నర్బ గర్భ వ్యాఖ్యలు చేశారని సమాచారం. 2013 వరకు బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ఉన్న అద్వానీ.. అంతకుముందు ఎబీ వాజ్ పేయి హయాంలో డిప్యూటీ ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారు.
కరాచీ అద్వానీ జన్మస్థలం
అవిభక్త భారతావనిలో 1927లో కరాచీలో జన్మించిన ఎల్ కే అద్వానీ తన కళాశాల విద్య సింధ్ లో పూర్తిచేసుకున్నారు. నాటి బాంబే నేటి ముంబైలోని ప్రభుత్వ న్యాయ కళాశాలలో న్యాయవాద డిగ్రీ పట్టా అందుకున్నారు. 1942లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్)లో చేరిన అద్వానీ 1947 నుంచి 1951 వరకు రాజస్థాన్ లో పని చేశారు. తర్వాత 1951లో శ్యామ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన జన్ సంఘ్ లో సభ్యుడిగా చేరారు.
జన్ సంఘ్ అధ్యక్షుడిగా అద్వానీ..
1973లో జన్ సంఘ్ అధ్యక్షుడిగా, 1976లో గుజరాత్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1975లో ఇందిరాగాంధీ ప్రధానిగా విదించిన అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా ఉద్యమించినందుకు జైలు పాలయ్యారు. తర్వాత 1977లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనతా పార్టీ గెలుపొండగా ఆ పార్టీ ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో సమాచార, ప్రసారాలశాఖ మంత్రిగా అద్వానీ బాధ్యతలు నిర్వర్తించారు. కానీ 1980లో జనతా పార్టీ ప్రయోగం విఫలమైంది. తిరిగి ఇందిరాగాంధీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.
బీజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా అటల్
జనతా పార్టీ ప్రయోగం విఫలం కావడంతో 1980లో జన్ సంఘ్ మాజీ నాయకులందరితో కలిసి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆవిర్భావానికి దారి తీసింది. బీజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా అటల్ బీహారీ వాజ్ పేయి ఎన్నికైతే అద్వానీ మాత్రం గుజరాత్ నుంచి మధ్య ప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నియ్యారు. వాజ్ పేయి హయాంలో హిందూత్వ వాదానికి మెరుగులు దిద్దారు. పరిస్థితులకు అనుగుణంగా మధ్యేవాద విధానాన్ని ప్రజల ముందుకు తెచ్చారు.
అప్పుడు బీజేపీ అధ్యక్షుడిగా అద్వానీ
కానీ 1984లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ కేవలం రెండు స్థానాలకు మాత్రమే పరిమితమయ్యారు. ఫలితంగా బీజేపీ అధ్యక్షుడిగా అద్వానీ ఎన్నికయ్యారు. ఒకవైపు పార్టీ పక్షాన రామ మందిర నిర్మాణానికి ఆందోళన సాగిస్తూనే అద్వానీ బీజేపీకి సమాంతరంగా విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్పీ) ఆధ్వర్యంలో రామ్ జన్మభూమి ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. దీని ప్రభావం 1989 లోక్ సభ ఎన్నికల్లో 80 స్థానాలకు ఎదిగేందుకు, వీపీ సింగ్ ప్రభుత్వానికి మద్దతునిచ్చేందుకు దోహద పడింది.
మండల్ నుంచి కమండల్ దాకా...
బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని మండల్ కమిషన్ చేసిన సిఫారసుల అమలుకు వీపీ సీంగ్ ప్రభుత్వం పూనుకోవడంతో బీజేపీ తన ‘కమండల' ఎజెండా ముందుకు తెచ్చింది. గుజరాత్ లోని సోమ్ నాథ్ నుంచి అయోధ్యకు పలు రాష్ట్రాల మీదుగా రథ యాత్ర సాగింది. ఈ రథయాత్ర పర్యవేక్షుడిగా నాడు నరేంద్రమోదీ వ్యవహరించారు. అయితే బీహార్ లో లాలూ ప్రసాద్ ప్రభుత్వం అద్వానీని అరెస్ట్ చేసిన తర్వాత జాతీయ స్థాయిలో బీజేపీకి మద్దతు పెరిగింది.
1991లో ప్రధాన విపక్ష స్థాయికి...
1991లో జరిగిన లోక్ సభ మధ్యంతర ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. తెలుగుతేజం పీవీ నర్సింహరావు సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైంది. మరుసటి ఏడాది 1992లో అద్వానీ తన మద్దతు దారులతో అయోధ్యకు బయలుదేరారు. మొగల్ సామ్రాజ్య హయాంలో నిర్మితమైన బాబ్రీ మసీదును 1992 డిసెంబర్ ఆరో తేదీన విధ్వంసం చేశారు.
అతిపెద్ద పార్టీగా బీజేపీ
1996 లోక్ సభ ఎన్నికల్లో అద్వానీ దూకుడుగా ప్రచారం చేయడంతో బీజేపీ లోక్ సభలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ అటల్ బీహారీ వాజ్ పేయిని ప్రధాని పదవికి అద్వానీ ప్రతిపాదించారు. నాటి నుంచి 1999 వరకు వాజ్ పేయి మూడు సార్లు ప్రధానిగా ప్రమాణం చేశారు. అద్వానీ పార్టీ కోసం పనిచేస్తూనే మరోవైపు వాజ్ పేయి సర్కార్ లో విధులు నిర్వర్తించారు. 2004 వరకు వాజ్ పేయి ప్రభుత్వంలో అడ్వానీ డిప్యూటీ పీఎంగా, హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
పదేళ్లు ఎన్డీయే అధికారానికి దూరం
2004 తర్వాత పదేళ్ల పాటు ఎన్డీయే అధికారానికి దూరమైంది. 2014 లోక్ సభ ఎన్నికల్లో అద్వానీని పక్కకు తప్పించిన బీజేపీ.. మోదీ హయాంలో పూర్తి మెజారిటీతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్రపతి పదవికి బరిలో అద్వానీ పేరు ప్రతిపాదించినా ఇతరుల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి.
పరిశీలనలో మణిపూర్ గవర్నర్
మణిపూర్ గవర్నర్ నజ్మా హెప్తుల్లా కూడా బీజేపీ నుంచి రాష్ట్రపతి పదవిని అలంకరించాలని ఉవ్విళ్లూరుతున్న నేతల్లో ఒకరు. ఈ మేరకు పార్టీ తరఫున మద్దతునివ్వాలని ఆమె బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కోరారు. 16 ఏళ్ల పాటు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన నజ్మా హెప్తుల్లా భారత తొలి విద్యాశాఖ మంత్రి, స్వాతంత్ర్య సమర యోధుడు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ మనుమరాలు కూడా. 2004 వరకు కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన నజ్మా హెప్తుల్లా 2004 ఎన్నికల ముందు బీజేపీలో చేరారు. మోదీ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన నజ్మా హెప్తుల్లా..గత ఏడాది జూలైలో మణిపూర్ గవర్నర్ గా నియమితులయ్యారు.
ఎంఎం జోషికి అవకాశం
గత ఏడాది ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్తో బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి భేటీ తర్వాత ఆయన పేరు కూడా రాష్ట్రపతి పదవికి పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. మోహన్ భగవత్ తో భేటీ తర్వాత న్యూఢిల్లీలో ప్రధాని మోదీ అధికార నివాసంలో విందుకు కూడా జోషి హాజరు కావడం గమనార్హం. ఈ విందు సమావేశంలో వీరిద్దరి మధ్య రాష్ట్రపతి పదవికి అభ్యర్థిత్వం గురించి చర్చకు వచ్చినట్లు సమాచారం. ఆరెస్సెస్ సిద్ధాంతకర్త దేవేంద్ర స్వరూప్ కూడా రాష్ట్రపతి పదవికి మురళీ మనోహర్ జోషి అర్హుడేనన్నారు.
బీజేపీ అధ్యక్షుడిగా జోషి
ఆరెస్సెస్కు అత్యంత సన్నిహితుడైన ఇందిరాగాంధీ ఆర్ట్స్ జాతీయ కేంద్రం చైర్మన్ రామ్ బహదూర్ రాయి కూడా జోషి అభ్యర్థిత్వానికి మద్దతు పలికారు. అయోధ్య ఉద్యమంలో అద్వానీతోపాటు మురళీ మనోహర్ జోషి కూడా సమాన బాధ్యతలు వహించారు. 1992లో కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చివేసినప్పుడు బీజేపీ అధ్యక్షుడిగా జోషి ఉన్నారు. వారణాసి నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న జోషి, 2014లో వైదొలిగేందుకు నిరాకరించినా.. మోదీ కోసం వైదొలగాల్సి వచ్చింది. తర్వాత కాన్పూర్ నుంచి రెండు లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
బిగ్ బీ పేరు ముందుకు...
బీజేపీ ఎంపీ శత్రఘ్న సిన్హా అనూహ్యంగా గత ఏడాది మే నెలలో రాష్ట్రపతి పదవికి బాలీవుడ్ నటుడు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ పేరును ముందుకు తెచ్చారు. సాంస్క్రుతిక రంగంలో ప్రముఖుడిగా ఉన్న అమితాబ్ బచ్చన్ను రాష్ట్రపతిగా నియమిస్తే దేశానికి గర్వ కారణంగా ఉంటుందని అభిప్రాయ పడ్డారు. సామాజికంగా, సాంస్క్రుతికంగా పలు మైులు రాళ్లు సాధించిన అమితాబ్ బచ్చన్.. దేశ రాష్ట్రపతి పదవికి అర్హుడని పేర్కొన్నారు. కానీ అమితాబ్ బచ్చన్ పేరు రాష్ట్రపతి పదవికి అమితాబ్ బచ్చన్ పేరు పరిశీలనలో ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావించడం లేదు.