ఇంకా రిసార్టులోనే మంత్రులు, ఎమ్మెల్యేల మకాం.. 25మందికి అస్వస్థత
రిసార్టులో ఉన్న ఎమ్మెల్యేల్లో పలువురు ఎమ్మెల్యేలు అనారోగ్యంతో అస్వస్థతకు గురైనట్టు నిన్నటి నుంచి వార్తలు వస్తున్నాయి.
చెన్నై: పన్నీర్ తిరుగుబాటు బావుటా ఎగరేయడంతో ఎమ్మెల్యేలు పట్టు జారిపోకుండా చూసుకోవడం కోసం అన్నాడీఎంకె ప్రధాన కార్యదర్శి వేసిన ఎత్తుగడ 'గోల్డెన్ బే రిసార్టు'. గడిచిన వారం రోజులకు పైగా తమిళనాడు పాలిటిక్స్ అన్ని ఈ రిసార్టు చుట్టూనే తిరుగుతూ వచ్చాయి.
చివరాఖరికి సుప్రీం తీర్పుతో శశికళ భంగపడ్డా.. శాసనసభాపక్ష నేతగా పళనిస్వామిని ఎంపిక చేసి ఎమ్మెల్యేలను పార్టీకి అంటిపెట్టి ఉంచడంలో సఫలమయ్యారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు గోల్డెన్ బే రిసార్టులోనే ఉన్న పరిస్థితి. సుప్రీం తీర్పు అనంతరం రిసార్టులోని ఎమ్మెల్యేలను, మంత్రులను పోలీసులు తరలించాలని ప్రయత్నించినా.. అందుకు వారు తిరస్కరించారు.

కాగా, రిసార్టులో ఉన్న ఎమ్మెల్యేల్లో పలువురు ఎమ్మెల్యేలు అనారోగ్యంతో అస్వస్థతకు గురైనట్టు నిన్నటి నుంచి వార్తలు వస్తున్నాయి. వేళకు మందులు వేసుకోకపోవడం, సరైన వ్యాయామం లేకపోవడం, ఇతరత్రా కారణాలతో 25మందికి పైగా శాసనసభ్యులు అస్వస్థతకు గురైనట్టు సమాచారం.
బుధవారం నాడు వారు రిసార్టు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా చెబుతున్నారు. బలనిరూపణపై నేడు గవర్నర్ విద్యాసాగర్ రావు నిర్ణయం తీసుకునే అవకాశం ఉండటంతో.. ఆయన నిర్ణయం వెలువడిన వెంటనే వారు బయటకొచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications