DRDO 2DG drug: తయారీ టెక్నాలజీ బదిలీ: తొలి ప్రాధాన్యత వారికే
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ దేశాన్ని సంక్షోభంలోకి నెట్టేసిన ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాక్సిన్లతో పాటు అందుబాటులోకి వచ్చిన మరో మెడిసిన్ .. 2డీజీ డ్రగ్. కరోనా వైరస్ బారిన పడిన పేషెంట్ల చికిత్సలో అత్యవసర వినియోగానికి ఈ డ్రగ్ను వినియోగించడానికి ఉద్దేశించిన మెడిసిన్ ఇది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) దీన్ని అభివృద్ధి చేసింది. 2-డియోక్సీ-డీ-గ్లూకోజ్ (2DG) వైద్య అవసరాల కోసం ఈ నెలలోనే కమర్షియల్ వినియోగానికి అందుబాటులోకి రానుంది.
ఇంటర్మీడియట్ పరీక్షలపై తేల్చేసిన తెలంగాణ ప్రభుత్వం: ఇక జగన్ సర్కార్పై మరింత ఒత్తిడి
కొరత లేకుండా..
2డీజీ డ్రగ్ వినియోగంలోకి వచ్చిన తరువాత.. దాని కొరత ఏర్పడకుండా డీఆర్డీఓ అధికారులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు. కరోనా వ్యాక్సిన్ లేదా యాంఫోటెరిసిన్ బీ ఇంజెక్షన్ల తరహాలో దీని లోటు ఏర్పడకూడదని వారు భావిస్తోన్నారు. ఇందులో భాగంగా- 2డీజీ డ్రగ్ మార్కెట్లోకి అందుబాటులోకి రాకముందే దాని ఉత్పత్తిని ఇబ్బడి ముబ్బడిగా చేపట్టాలని నిర్ణయించింది. ఈ ఉద్దేశంతో- ఇన్మాస్తో కలిసి తాము అభివృద్ధి చేసిన 2డీజీ డ్రగ్ టెక్నాలజీని ఇతర ప్రైవేటు ఫార్మాసూటికల్స్ కంపెనీలకు బదలాయించనుంది. దీనికోసం ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తులను సైతం ఆహ్వానించింది.
వాటికే తొలి ప్రాధాన్యత..
2డీజీ డ్రగ్ను తయారు చేయడానికి అవసరమైన టెక్నాలజీని డీఆర్డీఓ నుంచి స్వీకరించడానికి ఇప్పటిదాకా 15 దేశీయ ఫార్మా కంపెనీలు ముందుకొచ్చాయని డీఆర్డీఓ అధికారులు వెల్లడించారు. తొలిగా వచ్చిన వారికి తొలి ప్రాధాన్యత అనే విధానంలో దాన్ని బదలాయిస్తామని స్పష్టం చేశారు. ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తులను దాఖలు చేయడానికి ఈ నెల 17వ తేదీని తుదిగడువుగా నిర్ధారించినట్లు పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న ఫార్మా కంపెనీ ఉత్పాదక సామర్థ్యం, అనుసరించే సాంకేతిక పరిజ్ఙానం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని 2డీజీ తయారీ టెక్నాలజీని బదలాయిస్తామని స్పష్టం చేశారు.
మార్కెట్ రేటు రూ.990లుగా
డీఆర్డీఓ అధికారులు ఒక్కో శాచెట్ ధరను 990 రూపాయలుగా నిర్ధారించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ మెడిసిన్ వినియోగానికి డిస్కౌంట్ ఇస్తామని ఇదివరకే వెల్లడించారు. అలాగే- కరోనా వైరస్ బారిన పడి చికిత్స తీసుకుంటోన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సైతం డిస్కౌంట్ సౌకర్యం వర్తిస్తుందని పేర్కొన్నారు. ఈ నెల రెండోవారం నుంచి మార్కెట్లోకి ఈ మెడిసిన్ అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేశారు. అదే నెల మొదటివారంలోనే 2డీజీ డ్రగ్ ఉత్పత్తిని రెట్టింపు చేస్తామని అధికారులు పేర్కొన్నారు. డిమాండ్కు అనుగుణంగా వాటిని సరఫరా చేయాల్సి ఉన్నందున టెక్నాలజీని బదలాయించడానికి ముందుకొచ్చినట్లు చెప్పారు.
ఆక్సిజన్ అవసరాన్ని తగ్గించేలా..
కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన పేషెంట్ అందించే చికిత్సలో దీన్ని వినియోగిస్తారు. ఆ పేషెంట్ త్వరగా కోలుకోవడంలో 2డీజీ డ్రగ్స్ కీలక పాత్ర పోషిస్తుందని క్లినికల్ ట్రయల్స్లో తేలింది. రోగి శరీరంపై వేగవంతంగా పని చేస్తుందని క్లినికల్ ట్రయల్ ఫలితాల ద్వారా స్పష్టమైంది. అంటే ఈ మెడిసిన్ ఇవ్వగానే ఆక్సిజన్పై ఆధారపడటం తగ్గిపోతుంది. జెనరిక్ మోలిక్యూల్, గ్లూకోజ్ను పోలివుండే ఈ డ్రగ్ను క్లినికల్ ట్రయల్స్లో భాగంగా కరోనా సోకిన పేషెంట్లకు ఇవ్వగా..వారు తక్కువ సమయంలోనే కోలుకున్నారని డీఆర్డీఓ అధికారులు వెల్లడించారు.