2జీ డ్రగ్ వచ్చేసింది.. తొలుత దిల్లీ ఆసుపత్రులలో వినియోగం
కోవిడ్ లక్షణాలున్నవారికి చికిత్స చేసేందుకు దేశీయంగా తయారుచేసిన ఔషధాన్ని భారత్లో పంపిణీ ప్రారంభించారు.
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) రూపొందించిన 2-డీజీ అనే ఈ ఔషధాన్ని తొలుత రాజధాని దిల్లీలోని ఆసుపత్రులలో వినియోగిస్తున్నారు.
2-డీజీ మొదటి బ్యాచ్ మందులను కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్థన్కు అందించినట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు.
https://twitter.com/rajnathsingh/status/1394211948925915136
కోవిడ్-19తో బాధపడుతున్నవారు కోలుకోవడంలో ఇది అత్యంత కీలకంగా పనిచేస్తుందని ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
అయితే, కోవిడ్ చికిత్స కోసం అత్యవసరంగా ఈ మందుకు ఆమోదం పలకడంపై కొందరు విమర్శకులు హెచ్చరిస్తున్నారు. దీని పనితీరుకు సంబంధించి తగినంత డాటా ఇంకా అందుబాటులో లేదని అంటున్నారు.
2-డీజీగా పిలుస్తున్న ఈ '2 డియాక్సీ డి గ్లూకోజ్' మందును డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్తో కలిసి డీఆర్డీవో అభివృద్ధి చేసింది.
''ఆసుపత్రి పాలయిన కోవిడ్ రోగులు ఈ మందు వాడిన తరువాత తొందరగా కోలుకున్నట్లు క్లినికల్ ట్రయల్స్లో తేలింది.. అలాగే, కృత్రిమ ఆక్సిజన్ అందివ్వాల్సిన అవసరాన్నీ ఇది తగ్గించింద''ని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది.
అయితే, హ్యూమన్ ట్రయల్స్కు సంబంధించిన ఈ డ్రగ్ డాటా అందుబాటులో లేదని, కాబట్టి దీని సామర్థ్యంపై సందేహాలున్నాయని పలువురు నిపుణులు అంటున్నారు.
నిజానికి డీ2 అనేది క్యాన్సర్ చికిత్స కోసం రూపొందించిన ఔషధం అని.. చాలాకాలంగా దీన్ని చికిత్సలలో వాడుతున్నా ఇప్పటి వరకు ఆమోదం పొందలేదని చెబుతున్నారు.
కాగా కోవిడ్-19కి ఇంతవరకు ప్రత్యేకంగా చికిత్స లేదు. వ్యాధి లక్షణాలు తగ్గించడానికి వాడుతున్న మందులకు కూడా భారత్లో తీవ్రమైన కొరత ఉంది.
ఇప్పటివరకు 2.4 కోట్ల కేసులు, 2,70,000 మరణాలతో భారత్ ప్రపంచంలో ఈ వ్యాధి వల్ల తీవ్రంగా దెబ్బతిన్న దేశాలలో ఒకటిగా నిలిచింది.
కోవిడ్ సెకండ్ వేవ్ భారత్లో అనేక ప్రాంతాలలో విజృంభించింది.
ప్రస్తుత కోవిడ్ సంక్షోభం నుంచి వేగంగా బయటపడడానికి సహకరించే వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా భారత్లో అనుకున్నంత వేగంగా సాగడం లేదు.
''పెద్ద సంఖ్యలో రోగులకు ఆక్సిజన్ అవసరమవుతోంది. కరోనా ప్రభావిత కణాలను కోలుకునేలా చేయడంలో ఈ ఔషధం పనిచేస్తుంది. ఫలితంగా ఎందరో ప్రాణాలను నిలపొచ్చు. ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరాన్ని, సమయాన్ని కూడా ఈ మందు తగ్గిస్తుంది'' అని ప్రభుత్వ ప్రకటన ఒకటి తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- జెరూసలేంపై అమెరికాకు జోర్డాన్ హెచ్చరిక
- జెరూసలెం వివాదం: ఇజ్రాయెల్ కాల్పుల్లో 58 మంది పాలస్తీనీయుల మృతి
- సినోఫార్మ్: చైనా వ్యాక్సీన్ ఎమర్జెన్సీ వినియోగానికి డబ్ల్యూహెచ్వో ఆమోదం
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)