2జీ స్పెక్ట్రమ్ కేసు: విచారణకు హాజరైన కనిమొళి, 21న తుది తీర్పు
న్యూఢిల్లీ: 2జీ స్పెక్ట్రమ్ కేసులో ఈనెల 21వ తేదీన తుది తీర్పును ప్రకటించనున్నట్లు ఢిల్లీలోని పాటియాలా కోర్టు వెల్లడించింది. ఈ కేసులో ఎంపీ కనిమొళి మంగళవారం కోర్టు విచారణకు హాజరయ్యారు.
2జీ స్పెక్ట్రమ్ కేసులో ఆమె నిందితురాలిగా ఉన్నారు. తుది తీర్పు కోసం డిసెంబర్ 21 వరకు వేచి చూద్దామని ఆమె ఈ సందర్భంగా వ్యాఖ్యనించారు. గతంలో పలుమార్లు ఈ కేసు వాయిదా పడింది.
2జీ కేసులో నవంబర్ 7వ తేదీన చివరి విచారణ జరిగింది. అయితే ఆ విచారణలో తుది తీర్పు తేదీని డిసెంబర్ 5గా పాటియాలా కోర్టు పేర్కొంది. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలకు సంబంధం ఉన్న మూడు ప్రధాన స్పెక్ట్రమ్ కేసుల్లో సీబీఐ కోర్టు తన తీర్పును వెల్లడించాల్సి ఉంది.
టెలికాం శాఖ మాజీ మంత్రి ఏ.రాజా, ఎంపీ కనిమొళిలు ఆ కేసు ఛార్జ్షీట్లో నిందితులుగా ఉన్నారు. 2జీ స్పెక్ట్రమ్ కింద 122 లైసెన్సులు ఇవ్వడం వల్ల సుమారు ప్రభుత్వానికి రూ.31 వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు సీబీఐ తన కేసులో ఆరోపణలు చేసింది.
One of the accused in 2G spectrum scam case, Tamil Nadu MP Kanimozhi leaves from Patiala House Court, says 'let us see' on being asked of her expectation on the final hearing on 21st December. pic.twitter.com/tJ1F3GOqgq
— ANI (@ANI) December 5, 2017
వాస్తవానికి ఈ కేసులో గత అక్టోబర్ 25వ తేదీనే సీబీఐ కోర్టు తీర్పును ఇవ్వాల్సి ఉండగా, డాక్యుమెంట్లు ఎక్కువగా ఉన్న కారణంగా నవంబర్ 7వ తేదీకి వాయిదా వేసింది.
2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంపై సీబీఐ రెండు కేసులు నమోదు చేయగా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మరో కేసును వేసింది. రాజా, కనిమొళితో పాటు మరో 19 మందిపై 2014లో ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది.