3.12 లక్షల కోట్లు, ఇదీ తెలంగాణ అప్పు: ఉత్తమ్ కుమార్ రెడ్డి
రాష్ట్రాలకు ఇచ్చిన అప్పుల వివరాలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణకు 3.12 లక్షల కోట్ల అప్పు ఉంది. దీనిపై కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని ఆరోపించారు. ఎనిమిదేళ్లలో ఇంత అప్పు చేస్తారా అని మండిపడ్డారు. అప్పు చేసినా తెలంగాణ రాష్ట్రం మాత్రం డెవలప్ కాలేదని ఫైరయ్యారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులతో తెలంగాణలో ప్రతి వ్యక్తిపై లక్ష రూపాయల రుణభారం ఉందన్నారు.
శ్రీలంక పరిస్థితి తెలంగాణ ప్రజలకు రావొద్దనే అప్పుల లెక్కలను బయటపెడుతున్నామని ఉత్తమ్ పేర్కొన్నారు. లోక్సభలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. దేశవ్యాప్తంగా రాష్ట్రాలు తీసుకున్న అప్పుల వివరాలు రాతపూర్వకంగా వాటి వివరాలను ఆర్ధిక శాఖ సోమవారం విడుదల చేసింది. ఆర్బీఐ నివేదిక ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అప్పు రూ. 3,12,191.3 కోట్లు ఉందని తెలిపారు.
2018లో రూ. 1.6 కోట్లు, 2019 రూ.1.9 లక్షల కోట్లు, 2020లో రూ. 2.5 లక్షల కోట్లు, 2021లో రూ. 2.7 లక్షల కోట్లు, 2022లో రూ. 2.12 లక్షల కోట్ల అప్పు చేశారని వివరించారు. మొత్తం 3,12,191.3 లక్షల కోట్లు అప్పు ఉందని ఉత్తమ్ తెలిపారు. 2014లో ప్రతి మనిషి మీద రూ. 18,000 వేల అప్పు ఉంటే.. 2022 నాటికి ప్రతి మనిషి తలసరి అప్పు రూ.లక్షపైనే ఉందని.. ఐదు రెట్లు పెరిగిందని తెలిపారు.
అప్పులు తీసుకొచ్చి లాభాలు చూపించుకుంటున్నారని.. కార్పొరేషన్ ద్వారా డబ్బులు తీసుకొచ్చి ప్రాజెక్టులు కడుతున్నారని ఉత్తమ్ ఆరోపించారు. ప్రస్తుతం జీతాలు కూడా ఇవ్వని పరిస్థితిలో రాష్ట్రం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఒక్క పథకం కూడా సరిగ్గా అమలు కావట్లేదని.. మహిళల పథకాలు, ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించిన డబ్బులు విడుదల చేయట్లేదని వివరించారు.