చెట్టును ఢీకొన్న అంబులెన్స్: మంటలు చెలరేగి ముగ్గురు సజీవ దహనం
ఎరోడ్: తమిళనాడు రాష్ట్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. రోడ్డుపై వెళుతున్న ఓ అంబులెన్స్ అదుపుతప్పి చెట్టును ఢీకొంది. దీంతో అంబులెన్స్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో అంబులెన్స్లోని ఇద్దరు మహిళలతోపాటు మరో వ్యక్తి సజీవ దహనమయ్యారు.
ఛాతి నొప్పితో బాధపడుతున్నా కందస్వామి(61) వ్యక్తిని అంబులెన్స్ వ్యాన్లో సోమవారం ఉదయం తీసుకెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. అతనితోపాటు అతని భార్య, కోడలు అంబులెన్స్లో అతనితోపాటు ఆస్పత్రికి బయల్దేరారని చెప్పారు.
నియంత్రణ కోల్పోయిన డ్రైవర్ వ్యాన్ను అదుపుచేయలేకపోవడంతో రోడ్డుపక్కనే ఉన్న ఓ చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో సోమవారం ఉదయం 2గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. ఫ్యూయల్ ట్యాంక్ పగిలిపోవడంతో ఒక్కసారిగా వ్యానుకు మంటలు అంటున్నాయి.
సమీపంలో ఉన్న స్థానికులు బాధితుల అరుపులు విని ఘటనా స్థలానికి చేరుకున్నారు. కందస్వామిని, అతని కొడుకును రక్షించారు. కాగా, మంటలు తీవ్రం కావడంతో డ్రైవర్, ఇద్దరు మహిళలు అంబులెన్స్లోనే సజీవ దహనమయ్యారు. కందస్వామిని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు చెప్పారు.