మరో ముగ్గురు వలస కూలీల దుర్మరణం... ట్రక్కు బోల్తా పడి విషాదం..
రోడ్డు ప్రమాదాల్లో వలస కార్మికుల మరణాలకు బ్రేక్ పడట్లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్లో సోమవారం(మే 18) మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మహోబా జిల్లాలో వలస కూలీలతో వెళ్తున్న ట్రక్కు బోల్తా పడటంతో ముగ్గురు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. ఝాన్సీ-మీర్జాపూర్ హైవేపై పన్వాడి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. మృతి చెందిన ముగ్గురూ మహిళలే అని సమాచారం. గాయపడ్డవారిని పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు సమాచారం.
లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకూ రోడ్డు ప్రమాదాల్లో వలస కూలీలు మృతి చెందిన ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. వేర్వేరు ప్రమాదాల్లో దాదాపు 60కి పైగా వలస కూలీలు మృతి చెందారు. ఔరంగాబాద్లో 17 మంది వలస కూలీలు రైలు చక్రాల కింద నలిగిపోయిన ఘటన దేశం మొత్తాన్ని కదిలించింది.

శనివారం(మే 16)న ఉత్తరప్రదేశ్లో 24 మంది వలస కూలీలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ సంఘటన జరిగిన కొద్ది గంటల్లోనే.. మధ్యప్రదేశ్లో మరో ప్రమాదం చోటుచేసుకుంది. సాగర్ జిల్లాలోని బండా సమీపంలో ఓ ట్రక్కు బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగురు వలస కార్మికులు ప్రాణాలు విడిచారు. మహారాష్ట్ర నుంచి ఉత్తర్ప్రదేశ్కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇక లాక్ డౌన్ నేపథ్యంలో శ్రామిక్ రైళ్ల ద్వారా వలస కూలీలను స్వరాష్ట్రాలకు తరలిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రతీరోజూ పరిమిత సంఖ్యలోనే రైళ్లు నడుపుతుండటంతో కొంతమందికే పాసులు అందుతున్నాయి. దీంతో పాసుల కోసం వేచి చూసి విసుగుచెందినవారు.. కాలినడకనే స్వస్థలాలకు నడిచిపోతున్నారు.












Click it and Unblock the Notifications