ఏం చేశారు?: వీరి వివాహాలు ఆదర్శానికే ఆదర్శం!
ముంబై: ఈరోజల్లో పెళ్లంటే మామూలు విషయం కాదు. కొన్ని పెళ్లిళ్లు రూ. లక్షలతో ఒడ్డెక్కితే.. మరికొందరి వివాహాలు రూ. కోట్లతో ఉత్సవంలా జరుగుతున్నాయి. ఏదేమైనా ఎవరి స్తోమతను బట్టి వారు తమ పరిధిలో వివాహాన్ని ఘనంగా చేసుకునేందుకు ఆరాటపడతారు. ఎందుకంటే మనిషి జీవితంలో పెళ్లి అనేది ఒక ముఖ్యమైన ఘట్టం.
అయితే.. మహారాష్ట్రకు చెందిన ఓ జంట మాత్రం పెళ్లికి అయ్యే ఖర్చులను ఆదా చేసి ఆత్మహత్య చేసుకున్న రైతులకు విరాళంగా ఇచ్చి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది.ఈ జంటతో మరో రెండు జంటలు కూడా ఇదే తీరులో తమ వివాహాలు చేసుకోవడం గమనార్హం.
వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని అమరావతి జిల్లాకు చెందిన అభయ్ దివారె ప్రస్తుతం ఐఆర్ఎస్ ఆఫీసర్గా శిక్షణ తీసుకుంటున్నాడు. ప్రీతి ముంబైలోనే బ్యాంకు మేనేజర్గా ఉద్యోగం చేస్తోంది. వీరిద్దరికి పోటీపరీక్షల కోసం శిక్షణ తీసుకుంటుండగా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి.. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
అనుకున్నట్టుగా ఇద్దరు ఉద్యోగాల్లో చేరారు. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లికి సిద్ధమయ్యారు. అయితే.. అందరిలా ఘనంగా పెళ్లి చేసుకోకుండా పెళ్లికి అయ్యే ఖర్చును ఆదా చేసి ఆ డబ్బును ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు విరాళం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలో వారు సాదాసీదాగా వివాహం చేసుకున్నారు. అంతేగాక, వివాహ వేదిక నుంచే సామాజిక అంశాలపై పలువురితో ప్రసంగాలు ఇప్పించారు. ఈ తర్వాత పది రైతు కుటుంబాలకు రూ. 20వేల చొప్పు విరాళం ఇచ్చారు. అక్కడితో ఆగిపోలేదు వీరి ఉదారత. పోటీపరీక్షలకు సంబంధించిన పుస్తకాలను అమరావతిలోని లైబ్రరీకి విరాళంగా అందజేశారు.
కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవాలన్న రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అభయ్ చెప్పుకొచ్చాడు. అభయ్-ప్రీతిలు తీసుకున్న నిర్ణయాన్ని అక్కడున్న వారితోపాటు అందరూ అభినందించారు. వీరిపై సోషల్ మీడియా వేదికగా కూడా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ జంటను ఆదర్శంగా తీసుకుని అన్నదాతలను ఆదుకుంటే బాగుంటుందని పలువురు పేర్కొంటున్నారు.
ఇది ఇలా ఉండగా, పుణెకు చెందిన ఆదిత్యా తివారి అనే వ్యక్తి తన వివాహం(జులై 16) రోజున దివ్యాంగుడైన చిన్నారిని దత్తత తీసుకున్నారున అంతేగాక, తన వివాహ వేడుకకు 10వేల మంది నిరాశ్రయులను, అనాథ శరణాలయల్లోని పిల్లలకు ఆహ్వానం పలికాడు. వారికి కావాల్సిన పుస్తకాలు, మందులు అందించారు.
కాగా, గుజరాత్ రాష్ట్రానికి చెందిన వ్యాపారవేత్త జితేంద్ర పటేల్ తన వివాహానికి 18వేల మంది విధవలను ఆహ్వానించారు. పెళ్లికి పిలవడమేగాక వారందరికీ కానుకలు కూడా ఇచ్చి పంపారు. మరో 500మందికి ఒక్కో చొప్పున ఆవులను కూడా కానుకగా ఇచ్చారు. దీంతో వారి ఆర్థిక పరిస్థితి కొంత మెరుగవుతుందని ఆయన ఆలోచన.