3కేజీల బంగారం విమానాశ్రయ టాయిలెట్లో విడిచారు
న్యూఢిల్లీ: చిరుచినాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయం టాయిలెట్లో మూడు కిలోల బంగారు బిస్కెట్లు పోలీసులకు దొరికాయి. విదేశాల నుంచి విమానంలో వచ్చిన ప్రయాణికులందరినీ అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తూ ఉంటారు.
ఈ క్రమంలో మంగళవారం రాత్రి 11.30 గంటల సమయంలో విమానాశ్రయం లోపల ఉన్న టాయిలెట్లో గుర్తు తెలియని పార్సిల్ ఉన్నట్లు పారిశుద్ధ్య సిబ్బంది అధికారులకు తెలిపారు. వెంటనే అధికారులు అక్కడికి వెళ్లి చూడగా మూడు పార్సిల్స్ టాయిలెట్లో పడి ఉన్నాయి.
విమానాశ్రయ అధికారులు ఆ పార్సిళ్లను విప్పి చూడగా అందులో బంగారు బిస్కెట్లు కనిపించాయి. ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క కిలో బంగారు బిస్కెట్లు ఉన్నట్లు.. మూడు కిలోల బంగారు బిస్కెట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వాటి విలువ సుమారు రూ. 82 లక్షలుగా ఉంటుందన్నారు.
సాధారణంగా విమానాశ్రయాల్లో బంగారాన్ని పోలీసులు అప్పుడప్పుడు పట్టుకుంటూనే ఉంటారు. కానీ ఇంత పెద్ద మొత్తంలో ఈ విమానాశ్రయంలో దొరకడం ఇదే మొదటిసారని విమానాశ్రయ అధికారులు తెలిపారు.
మంగళవారం రాత్రి కౌలాలంపూర్, సింగపూర్ నుంచి రెండు విమానంలో వచ్చిన ప్రయాణీకుల్లో ఎవరైనా పోలీసుల తనిఖీలకు భయపడి తెచ్చిన బంగారు బిస్కెట్లను టాయిలెట్లో పడవేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. దీంతో పోలీసులు రెండు విమానాల్లోని ప్రయాణీకుల పేర్లను పరిశీలిస్తున్నారు.