భారత్ బయోటెక్ నుంచి కొత్త వ్యాక్సిన్ వచ్చేసింది- అక్కడే అందుబాటులో
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి ఉద్దేశించిన నాసిల్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ కు చెందిన టాప్ ఫార్మాసూటికల్స్ కంపెనీ భారత్ బయోటెక్ దీన్ని అభివృద్ధి చేసింది. రెండు రోజుల కిందటే సుమారు మూడు లక్షల డోసులను ఎంపిక చేసిన ఆసుపత్రులకు పంపించింది. కోవిన్ యాప్ ద్వారా ఈ ఇంట్రానాసిల్ వ్యాక్సిన్ ను బుక్ చేసుకునే వెసలుబాటు ఉంది. ఈ నాజిల్ వ్యాక్సిన్ పేరు ఇంకోవ్యాక్.
భారత్ లో ఇంట్రానాసిల్ వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం ఇదే తొలిసారి. ముక్కు ద్వారా వ్యాక్సిన్ వేసుకోవాలంటే 18 సంవత్సరాలు నిండి ఉండాలి. 18 సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే ఈ వ్యాక్సిన్ వేసేలా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను ఆమోదించింది. దీన్ని అభివృద్ధి చేయడానికి భారత్ బయోటెక్.. అమెరికాలోని వాషింగ్టన్ విశ్వవిద్యాలయం సహకారాన్ని తీసుకుంది. బూస్టర్ షాట్ గా దీన్ని ఇవ్వనుంది కేంద్ర ప్రభుత్వం.
ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాక్సిన్, సీరం ఇన్స్టిట్యూట్ డెవలప్్ చేసిన కోవిషీల్డ్, కోవావాక్స్, రష్యాకు చెందిన స్పుత్నిక్, బయోలాజికల్ ఈ లిమిటెడ్ కు చెందిన కోర్బెవాక్స్ అందుబాటులో ఉన్నాయి. వాటన్నింటినీ కోవిన్ పోర్టల్ లో పొందుపరిచింది కేంద్ర ప్రభుత్వం. తాజాగా ఇంకోవ్యాక్ కూడా వాటి సరసన చేరింది. మార్కెట్ లో దీని ధర 800 రూపాయలుగా నిర్ధారించింది భారత్ బయోటెక్. కేంద్ర ప్రభుత్వానికి 325 రూపాయలకు సరఫరా చేస్తోంది.
దీనిపై భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ కృష్ణా ఎల్లా మాట్లాడారు. బెంగళూరులో యూనివర్శిటీ ఆఫ్ విస్కాన్సిన్ - మాడిసన్ గ్లోబల్ హెల్త్ ఇన్స్టిట్యూట్, ఎల్లా ఫౌండేషన్ మధ్య కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందంపై సంతకాలు చేసే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు.
రెండు రోజుల కిందటే మూడు లక్షల డోసుల ఇంకోవ్యాక్ వ్యాక్సిన్ ను ఆసుపత్రులకు పంపించామని అన్నారు. ఎల్లా ఫౌండేషన్, యూడబ్ల్యూ-మాడిసన్ జీహెచ్ఐ సంస్థలు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, నాలెడ్జ్ షేరింగ్లో సరికొత్త ఆవిష్కరణలను చేపడతాయని అన్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఈ ఫౌండేషన్ కార్యకలాపాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. వైద్యరంగంలో మరిన్ని ఆవిష్కరణలకు ఇది నాంది పలుకుతుందని వివరించారు.