సీబీఐ తదుపరి అధినేత ఎవరు?: ప్రధాని మోడీ నేతృత్వంలో భేటీ, షార్ట్ లిస్ట్లో ముగ్గురి పేర్లు!
న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కి కొత్త డైరెక్టర్ నియామకంపై సోమవారం ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో ఉన్నతస్థాయి కమిటీ సమావేశమైంది. సీబీఐ తదుపరి అధిపతిని ఎంపిక చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, లోక్సభలో కాంగ్రెస్ సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌధురి సమావేశమై ముగ్గురి పేర్లను షార్ట్ లిస్ట్ చేసినట్లు సమాచారం.
1984-87 బ్యాచ్లకు చెందిన దాదాపు 100 మందికిపైగా అధికారుల పేర్లను ఈ పదవి కోసం ఈ హైపవర్ కమిటీ పరిగణలోకి తీసుకుంది. సోమవారం సాయంత్రం 6.30 గంటల నుంచి దాదాపు 90 నిమిషాలపాటు జరిగిన ఈ ఉన్నతస్థాయి ప్యానల్ సమావేశంలో ముగ్గురు అధికారుల పేర్లను షార్ట్ లిస్ట్ చేసినట్లు తెలిసింది.
వీరిలో ఉత్తరప్రదేశ్ డీజీపీ హెచ్సీ అవస్తీ(1985 బ్యాచ్ ఐపీఎస్ అధికారి), సహస్త్ర సీమా బల్(ఎస్ఎస్బీ) డీజీ కేఆర్ చంద్ర, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి(అంతర్గత భద్రత) వీఎస్కే కౌముది పేర్లు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.
Recommended Video
ఈ పదవికి ఎంపికైనవారు రెండేళ్లపాటు సీబీఐ డైరెక్టర్గా కొనసాగనున్నారు. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలోనే సీబీఐ డైరెక్టర్ ఆర్కే శుక్లా పదవీ విరమణ చేయడంతో.. ఆ శాఖలో సీనియర్ అధికారి, సంయుక్త డైరెక్టర్ గా ఉన్న ప్రవీణ్ సిన్హా తాత్కాలిక డైరెక్టర్గా కొనసాగుతున్నారు. నాలుగు నెలల ముందుగానే కమిటీ సమావేశమై సీబీఐ కొత్త అధిపతిని ఎంపిక చేయాల్సి ఉన్నప్పటికీ.. వివిధ కారణాలతో ఆలస్యమైంది.