దేశంలో భారీగా తగ్గిన కరోనా కొత్త కేసులు, 4 లక్షల దిగువకు యాక్టివ్ కేసులు: కేరళలోనూ
న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. అయితే, గత కొద్ది రోజులుగా కొత్త కేసులు స్వల్పంగా తగ్గుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 31 వేల మందికి పాజిటివ్ కేసులు వెలుగుచూడగా, 300కు దిగువనే మరణాలు సంభవించాయి. వరుసగా రెండో రోజు కూడా కొత్త కేసుల కంటే కోలుకున్నవారి సంఖ్యే ఎక్కువగా ఉండటం ఊరటనిచ్చే అంశం.

దేశంలో తగ్గిన కరోనా కేసులు.. 4 లక్షల దిగువకు యాక్టివ్ కేసులు
దేశ వ్యాప్తంగా సోమవారం 15 లక్షలకుపైగా కరోనా పరీక్షలు నిర్వహించగా.. 31,222 కొత్త కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.30 కోట్లు దాటింది. అదే సమయంలో 290 మంది కరోనా బారినపడి మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,41,042కు పెరిగింది. కాగా, 42,942 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 3.22 కోట్లు దాటింది. దేశంలో రికవరీ రేటు 97.48 శాతంగా ఉంది. కొత్త కేసులు తగ్గముఖం పట్టడంతోపాటో కోలుకున్నవారి సంఖ్య పెరగడంతో మరోసారి యాక్టివ్ కేసుల సంఖ్య 4 లక్షల దిగువకు పడిపోయింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 3,92,864 యాక్టివ్ కేసులున్నాయి. పాజిటివిటీ రేటు 1.19 శాతంగా ఉంది.

కేరళలో కరోనా తగ్గుముఖం.. నిఫా వైరస్ కలకలం
కాగా, కేరళ రాష్ట్రంలోనూ కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. కేరళలో కొత్తగా 19,688 కరోనా కేసులు నమోదు కాగా, 135 మరణాలు సంభవించాయి. మరోవైపు గత 24 గంటల్లో 28,561 మంది కరోనా రోగులు కోలుకున్నారు. దీంతో కరోనా నుంచి ఇప్పటి వరకు కోలుకున్న వారి మొత్తం సంఖ్య 39,66,557కు చేరుకుందని, ప్రస్తుతం రాష్ట్రంలో 2,38,782 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేరళ ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కేసులు తగ్గుతుండగా, మరోవైపు నిఫా వైరస్ వ్యాప్తి ఇప్పుడు రాష్ట్రంలో కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే 12 ఏళ్ల ఓ బాలుడు మరణించగా, వందమందికిపైగా ఈ వ్యాధితో బాధపడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. నిఫా వైరస్) ఒక ప్రమాదకరమైన వైరస్. ఇది జంతువులలో, మానవులలో తీవ్రమైన పరిస్థితికి దారితీస్తుంది. తాజాగా తేలిన విషయమేమిటంటే ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ప్రస్తుతం కేరళ కరోనా మహమ్మారి ముప్పుతో పాటు నిపాను కూడా ఎదుర్కొంటోంది.

దేశంలో 70 కోట్ల మందికి వ్యాక్సిన్ పంపిణీ
మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. సోమవారం మరోసారి కోటి మందికిపైగా టీకాలు వేశారు. నిన్న 1.13 కోట్ల మందికి వ్యాక్సిన్ పంపిణీ చేశారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 69.90 కోట్లకుపైగా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇది ఇలావుండగా, కరోనా టీకాలు వేయడంలో రికార్డు సృష్తిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ప్రతి రోజూ 1.25 కోట్ల మందికి వ్యాక్సిన్లు ఇస్తున్నామని, ఇది కొన్ని దేశాల జనాభా కన్నా ఎక్కువని చెప్పారు. హిమాచల్ప్రదేశ్లో అర్హులైన వారందరికీ తొలి డోసు టీకాలు వేయడం పూర్తైన సందర్భంగా ప్రధాని మోడీ ఆ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రవాణా పరమైన సమస్యలు ఉన్నప్పటికీ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో హిమాచల్ ప్రదేశ్ విజేతగా నిలిచిందని ప్రశంసించారు. తొలిడోసు పూర్తి చేయడంతోపాటు రెండో డోసు కూడా 30 శాతం మందికి ఇచ్చిందని తెలిపారు. ఈ సందర్భంగా హిమాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్, వైద్య సిబ్బందిని ప్రధాని అభినందించారు. సిక్కిం, దాద్రానగర్ హవేలీలు కూడా ఈ ఘనత సాధించాయన్నారు. ప్రజల సహకారంతోనే సాధ్యమైందన్నారు. దేశంలో ఇప్పటి వరకు 70 కోట్ల మందికి వ్యాక్సిన్ అందించామన్నారు.












Click it and Unblock the Notifications