కేరళలో ప్రకృతి బీభత్సం: 324కు చేరిన మృతులు, 4వేల మందిని కాపాడిన ఎన్డీఆర్ఎఫ్, ఘోర విపత్తంటూ సీఎం
Recommended Video
తిరువనంతపురం: కేరళలో భారీ వర్షాలు, వరదలు ప్రజా జీవనాన్ని అస్తవ్యస్థం చేస్తున్నాయి. ఒక్కరోజులోనే మృతుల సంఖ్య తీవ్రంగా పెరిగింది. గడిచిన తొమ్మిది రోజుల్లో ప్రాణ నష్టం 324కు చేరిందని ముఖ్యమంత్రి పినరయి విజయన్ వెల్లడించారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితులపై తాజాగా అప్రమత్తత ప్రకటిస్తూ నివేదిక విడుదల చేశారు.
అతలాకుతలమవుతోంది..
దాదాపు 2 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. లక్షన్నర మంది వరకు సురక్షిత కేంద్రాలకు తరలించారు. భారీ వర్షాల కారణంగా వరదలతో అతలాకుతలం అవుతున్న రాష్ట్రాన్ని కొండ చరియలు మరింత ఇబ్బంది పెడుతున్నాయి. ఈ రోజు పరిస్థితి మరింత తీవ్రంగా మారిపోయింది. పలు ఆసుపత్రులు తీవ్ర ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటున్నాయి. తీవ్ర ఇంధన కొరతతో సతమవుతోంది. యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. పరిస్థితిని ప్రధాని మోడీకి వివరించినట్లు విజయన్ తెలిపారు.
వందేళ్లలో ఇదే తొలిసారి
‘దాదాపు 100 సంవత్సరాల్లో రానంత పెద్ద విపత్తు ఇప్పుడు సంభవించింది. 80 డ్యాములు తెరిచాం. 324 మంది చనిపోయారు. 1500లకు పైగా ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో 2,23,139 మంది ఆవాసం పొందుతున్నారు' అని ముఖ్యమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. సుమారు 4వేల మందికిపైగా బాధిత ప్రజలను ఎన్డీఆర్ఎఫ్ దళాలు కాపాడాయి.
ఇళ్లు నేలకూలుతున్నాయి..
భారీ వర్షాలకు కొడుగుతోపాటు ఇతర జిల్లాలో పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి. అనేక భవంతులు నేలకూలుతుండగా తీసిన వీడియో సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి. రెండంతస్తుల ఈ భవనం పునాది దెబ్బతినడంతో జారిపడిపోయింది.
గర్భిణీని కాపాడిని ఎన్డీఆర్ఎఫ్ దళాలు
వరదల్లో చిక్కుకున్న ప్రజలకు సహాయక చర్యలు అందించడానికి ఇప్పటికే అక్కడ ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ బృందాలు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ప్రసవ వేదనతో బాధ పడుతున్న ఓ గర్భిణి సైతం వరద నీటిలో చిక్కుకుంది. కనుచూపు మేరలో అంతా నీటిమయం కావడంతో ఆమె ప్రసవం కష్టమైంది. దీంతో రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్, ఎయిర్ఫోర్స్ సిబ్బంది ఆమెను కాపాడిన తీరు వారిపై ప్రశంసల జల్లును కురిపిస్తోంది. గర్భిణిని తాడు సాయంతో జాగ్రత్తగా హెలికాప్టర్లోకి చేరుస్తున్న వీడియో వైరల్ అవుతోంది.
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ
వాతావరణం అనుకూలించపోయినా విజయ్ వర్మ అనే పైలట్ చాకచక్యంగా హెలికాప్టర్ నడిపి ఆమె ప్రాణాలను నిలిపాడు. వెంటనే ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. కొంత సేపటికే ప్రసవించిన ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడు తల్లీబిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబసభ్యులు వైద్యులకు, ఎన్డీఆర్ఎఫ్, ఎయిర్ఫోర్స్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.
ప్రాణాలతో చెలగాటం
కేరళలో భారీ వరదలో రోడ్లు, వంతెనలు మునిగిపోతున్నాయి. కొందరు అజాగ్రత్తగా వ్యవహరిస్తూ ప్రాణాలు మీదకు తెచ్చుకునేలా వ్యవహరిస్తుండటం ఆందోళనకు గురిచేస్తోంది. అప్పటికే బ్రిడ్జి మీదుగా నీరు ప్రవహిస్తున్నా ఒక కారు, ఆటో దాన్ని దాటేశాయి. ఈ రెండు వాహనాలు వెళ్లడాన్ని చూసిన మరో వ్యక్తి తన కారును బ్రిడ్జ్ దాటించాలా? వద్దా? అని ఆలోచిస్తూ, చివరకు వేగంగా దాన్ని దాటించేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. ప్రజలు తామున్న ప్రాంతం నుంచి సురక్షితమైన మార్గాలకు వెళ్తున్నారు. అయితే ఇలా అత్యంత ప్రమాదకర ప్రాంతాల్లో సాహసాలు చేయడం ప్రాణానికే ప్రమాదమని అధికారులు హెచ్చరిస్తున్నారు. సహాయక బృందం వచ్చేవరకు ఎదురు చూడకుండా సొంతంగా ప్రయత్నించి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హితవు పలుకుతున్నారు
14జిల్లాల్లో రెడ్ అలర్ట్.. అంధకారంలో కేరళ
14 జిల్లాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. రాష్ట్రంలో పలుచోట్ల విద్యుత్ లేక అల్లాడిపోతున్నారు. కేరళ విద్యుత్ బోర్డు పవర్కట్ చేయడంతో దాదాపు 80శాతం రాష్ట్రం చీకట్లో మగ్గుతోంది. కొబ్బరి, కాఫీ, నల్ల మిరియాలు లాంటి ఇతర ముఖ్య పంటల ఉత్పత్తి కూడా తీవ్రంగా దెబ్బతింది. వరదలు, కొండచరియలు కారణంగా కొజీకోడ్, ఎర్నాకులం, తిరువనంతపురం, పాలక్కాడ్, త్రిశూర్, పతనమిత్తిట్ట, ఇడుక్కి జిల్లాల్లో రోడ్లు, రైలు మార్గాలు దెబ్బతిన్నాయి. దీంతో అనేక రైళ్లను రద్దు చేశారు. మరికొన్నింటికి దారి మళ్లించారు. అలాగే ఆగస్టు 26 వరకు కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులను రద్దు చేశారు.14 జిల్లాల్లో సుమారు 2లక్షలకు పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. 32,500పైగా ఎకరాల్లో పంట దెబ్బతిందని నేషనల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ ప్రకటించింది. కేరళ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీని సుప్రీంకోర్టు కోరింది. మరోవైపు కేరళలోని వరద పరిస్థితిని సమీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం సాయంత్రం రాష్ట్రానికి వెళ్లనున్నారు. శనివారం ఉదయం వరద ప్రాంతాలను హెలికాప్టర్లో వీక్షించనున్నారు.