Haryana polling: ఓటేసిన మనూ బాకర్, వినేష్ ఫోగట్- 1 గంటకు 36.7 శాతం పోలింగ్..!
హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ క్రమంగా ఊపందుకుంటోంది. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్, ఆప్, మరో రెండు కూటముల మధ్య జరుగుతున్న చతుర్ముఖ పోటీలో ఓటరు ఎవరికి అనుకూలంగా స్పందిస్తున్నారన్న ఉత్కంఠ నెలకొంది. ఉదయం నుంచీ సీఎం నాయబ్ సైనీ, మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ సహా పలువురు వీఐపీలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే స్టార్ క్రీడాకారులు మనూ బాకర్, వినేష్ ఫోగట్ కూడా ఓటేసిన వారిలో ఉన్నారు.
ఇవాళ జరుగుతున్న హర్యానా ఎన్నికల్లో నాయబ్ సైనీ, భూపీందర్ హుడా, వినేష్ ఫోగట్ సహా దాదాపు వెయ్యి మంది అభ్యర్ధుల భవితవ్యం తేలనుంది. కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నెలకొన్న నేపథ్యంలో పోలింగ్ శాతం కూడా కీలకంగా మారింది. దీంతో సాధ్యమైనంత ఎక్కువ మంది ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించేందుకు రాజకీయ పార్టీలు శ్రమిస్తున్నాయి. బీజేపీ హ్యాట్రిక్ మీద కన్నేయగా.. కాంగ్రెస్ పదేళ్ల తర్వాత అధికారం దక్కించుకునేందుకు శ్రమిస్తోంది.

హర్యానా ఎన్నికల్లో దాదాపు రెండు కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. వీరిలో కోటికి పైగా పురుషులు, దాదాపుగా అంతే మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 2019 ఎన్నికల్లో హర్యానాలో 68 శాతం పోలింగ్ నమోదైంది.

ఈసారి ఆ రికార్డు బద్దలవుతుందా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలో గత ఐదేళ్లలో చోటు చేసుకున్న పరిణామాలతో పాటు రైతులు, రెజ్లర్లు, సైనికుల విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాలు ఓటరు నిర్ణయాన్ని ప్రభావితం చేయొచ్చన్న అంచనాలున్నాయి. సాయంత్రం ఆరున్నర గంటల తర్వాత హర్యానా ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి.












Click it and Unblock the Notifications