ఢిల్లీలో కొనసాగుతున్న కరోనా కల్లోలం-ఒక్క రోజులో 38 శాతం పెరిగిన కేసులు- ఆరునెలల్లో టాప్
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ఇప్పటికే పెరిగిపోతున్న ఓమిక్రాన్ వైరస్ కేసులకు తోడు పాత వైరస్ కేసులు కూడా ఎక్కువగా నమోదవుతుండటంతో ఈ సంఖ్య మరింత ఎక్కువగా కనిపిస్తోంది. తాజాగా ఒక్క రోజు వ్యవధిలోనే ఏకంగా 38 శాతం కరోనా కేసుల పెరుగదల నమోదైంది. ఇది గత ఆరునెలల్లో గరిష్టం కావడం మరో విశేషం.
ఢిల్లీలో ఇవాళ ఒక్కరోజే 249 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి నిన్నటి కంటే ఇది 38 శాతం అదనం. అలాగే అత్యంత అంటువ్యాధి అయిన ఓమిక్రాన్ వేరియంట్పై పెరుగుతున్న ఆందోళనగా భావిస్తున్నారు. గత ఆరు నెలల్లో ఇదే అత్యధికం కూడా. ఢిల్లీ నగరంలో కరోనా వైరస్ సంక్రమణ కారణంగా ఒకరు చనిపోయారు. దీంతో ఢిల్లీలో మొత్తం మరణాల సంఖ్య 25,104కి చేరుకుంది. ఒక్క డిసెంబర్లో ఇప్పటివరకు ఆరు మరణాలు నమోదయ్యాయి.
ఢిల్లీలో అధికారిక గణాంకాల ప్రకారం, 0.29 శాతం పెరిగిన పాజిటివిటీ రేటుతో నిన్న ఒక్క రోజు 180 తాజా కేసులు నమోదయ్యాయి. తాజా సమాచారం ప్రకారం, జూన్ 13న జాతీయ రాజధానిలో 0.35 శాతం పాజిటివిటీ రేటుతో 255 కేసులు నమోదు అయిన తర్వాత ఈ పెరుగుదల అత్యధికంగా భావిస్తున్నారు. ఇవాళ మొత్తం కేసుల సంఖ్య 14,43,062కి చేరింది. ఢిల్లీలో 14.17 లక్షల మంది రోగులు వైరస్ బారిన పడి కోలుకున్నారు.
కొత్త ఓమిక్రాన్ వేరియంట్ కేసుల పెరుగుదల నేపథ్యంలో ఢిల్లీలో గత కొన్ని రోజులుగా కోవిడ్ కేసులు గణనీయంగా పెరిగాయి. నగరంలో 67 ఓమిక్రాన్ కేసులు కూడా ఉన్నాయి. మరోవైపు ఎయిర్ పోర్టులో నిర్వహిస్తున్న కరోనా పరీక్షల్లో ప్రతీ ఐదుగురిలో ఒకరు ఓమిక్రాన్ వైరస్ బాధితులుగా తేలుతున్నట్లు తాజాగా నివేదికలు కూడా వెలువడ్డాయి. దీంతో ఢిల్లీపై కేంద్రం ఫోకస్ కూడా పెరుగుతోంది.