ఆపరేషన్ 3 డే: పాంపోర్లో రెండో ఉగ్రవాది కాల్చివేత
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లా పాంపార్లోని ఈడీఐ భవనం వద్ద ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య సోమవారం ప్రారంభమైన కాల్పులు బుధవారం కూడా కొనసాగుతున్నాయి. గత మూడు రోజులుగా ఈ కాల్పులు కొనసాగుతుండటంతో ఉద్రికత్త నెలకొంది.
ప్రభుత్వరంగ సంస్థ ఎంటర్ప్రెన్యూర్ షిప్ డెవలప్మెంట్ (ఈడీఐ) బిల్డింగ్ నుంచి ఉగ్రవాదులు మూడు రోజులుగా కాల్పులు జరుపుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ భవనంలో దాగి ఉన్న ఉగ్రవాదులు కాల్పులు జరుపు తున్నారు. ఈ కాల్పుల్లో మంగళవారం ఒక ఉగ్రవాది మృతిచెందినట్టు భద్రతా అధికారులు తెలిపారు.
తాజాగా బుధవారం జరిపిన కాల్పుల్లో మరో తీవ్రవాది హతమైనట్టు వెల్లడించారు. దీంతో కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి. భద్రతా సిబ్బందికి ఎలాంటి ప్రాణనష్టం కలగకుండా భవంతిలోకి భద్రతా దళాలు చేరుకున్నాయి.
ఈడీఐ భవనంలోకి ప్రవేశించిన అనంతరం అన్ని గదుల్లో భద్రతా బలగాలు గాలిస్తున్నాయి. భవనంలో మరో ఉగ్రవాది దాగి ఉన్నట్లు అనుమానిస్తున్నారు. శ్రీనగర్- జమ్మూ జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఈ బిల్డింగ్లోకి జీలం నది గుండా ముగ్గురు ఉగ్రవాదులు భవంతిలోకి చొరబడి నిప్పుపెట్టారు.
దీంతో ఉగ్రవాదులు తప్పించుకోకుండా ఈడీఐ బిల్డింగ్ ప్రాంతాన్ని ఆర్మీ ఆధీనంలోకి తీసుకుంది. భవనంలో దాక్కున్న మరో ఉగ్రవాదిని ఏరివేసేందుకు భద్రతా దళాలు పెద్ద ఎత్తున మోర్టార్ సెల్స్ ఉపయోగిస్తున్నాయి. రంగంలోకి పారా కమెండోలు కూడా దిగాయి.