ప్రాణాలు పోతున్నా..: ఉగ్ర కాల్పుల్లో ఆర్మీ మేజర్, ముగ్గురు సైనికులు మృతి
శ్రీనగర్: తమ ప్రాణాలు పోతున్నా.. ఉగ్రవాదులను మన దేశంలోకి రాకుండా అడ్డుకున్నారు మన సైనికులు. మంగళవారం నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వద్ద ఉగ్రవాదులు కాల్పులతో తెగబడ్డారు. ఈ ఘటనలో ఓ ఆర్మీ మేజర్, ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
ఉత్తర కశ్మీర్ ప్రాంతంలోని గురెజ్లో ముష్కరులు చొరబాటుకు యత్నిస్తుండగా.. సైనికులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో మేజర్, ముగ్గురు సైనికులు చనిపోయారని అధికారులు వెల్లడించారు. మరణించిన సైనికులను మేజర్ కేపీ రాణె, జామీ సింగ్, విక్రమ్జీత్, మణిదీప్లుగా గుర్తించారు.
ప్రాణాలు పణంగా పెట్టి చొరబాటు యత్నాన్ని సైనికులు అడ్డుకున్నారు. కాగా, భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. గురెజ్ సెక్టార్లో సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద నుంచి సుమారు ఎనిమిది మంది ఉగ్రవాదులు కాశ్మీర్లోకి ప్రవేశించేందుకు విఫలయత్నం చేశారు.
ఉగ్రవాదుల చొరబాటును గమనించిన భారత సైన్యం వారికి ధీటుగా బదులిచ్చింది. దీంతో నలుగురు ఉగ్రవాదులు పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలోకి పారిపోయారని తెలిపారు. ఇరు వర్గాల మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి.