ప్రబలుతున్న వ్యాధులు: నాకు అధికారం లేదని కేజ్రీవాల్ షాకింగ్
న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రబలుతున్న వ్యాధుల పైన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ షాకింగ్ సమాధానం చెప్పారు. దీని గురించి ప్రధాని నరేంద్ర మోడీని అడగాలని చెప్పారు. తమకు అధికారం లేదని, ప్రధానినే అడగాలన్నారు.
ఢిల్లీలో చికున్గన్యాతో పాటు పలు వ్యాధులు ప్రబలుతున్నాయి. ఈ సమయంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ అవేమి పట్టనట్లు గోవాలో పర్యటిస్తున్నారు. వచ్చే ఏడాది గోవాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏఏపీ ఎన్నికల ప్రచార పరిస్థితిని పర్యవేక్షించడానికి ఆయన గోవా వెళ్లారు.
మరోవైపు, గొంతు సర్జరీ నిమిత్తం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెంగళూరులో ఉన్నారు. ఇలా మంత్రులు ఎవరి పనుల మీద వారు వేరే ప్రాంతాల్లో ఉండటంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. అదే విధంగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ కూడా అమెరికా పర్యటనలో ఉన్నారు.
ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోకపోవడంపై కేజ్రీవాల్ మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులకు ప్రస్తుతం ఎలాంటి అధికారాలు లేవని, కనీసం పెన్ను కూడా కొనుక్కోడానికి లేదని, లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ), ప్రధానమంత్రి అన్ని అధికారాలను అనుభవిస్తున్నారని, లెఫ్టినెంట్ గవర్నర్ విదేశాల్లో ఉన్నారని, ఏమైనా ప్రశ్నించాలంటే వాళ్లని ప్రశ్నించాలని కేజ్రీవాల్ మంగళవారం సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో ట్వీట్ చేశారు.