కారు భీభత్సం... అతి వేగానికి నలుగురు బలి... బద్దలైన కేఫ్ గోడ... నుజ్జునుజ్జయిన కారు...
ముంబైలోని క్రాఫర్డ్ మార్కెట్లో సోమవారం రాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. పాదాచారుల పైకి దూసుకెళ్లిన కారు... ఆపై జనతా కేఫ్ గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా... మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. అతివేగంతో దూసుకురావడం వల్లే ప్రమాదం సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కారు డ్రైవర్పై గతంలోనూ యాక్సిడెంట్ కేసు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు.
Recommended Video
ఆ ఇద్దరిని ఈడ్చుకు వెళ్లిన కారు...
అసద్ ఖురేషీ అనే ప్రత్యక్ష సాక్షి ప్రమాద వివరాలు మీడియాకు వెల్లడించారు. సోమవారం రాత్రి 9గం. తర్వాత తాను జనతా కేఫ్ వద్ద నుంచి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో... ఓ తెలుపు రంగు మారుతీ ఎస్టీమ్ కారు అతివేగంతో దూసుకొచ్చినట్లు చెప్పారు. మెట్రో సినిమా సిగ్నల్ పాయింట్ నుంచి జేజే ఫ్లైఓవర్ వైపు దూసుకొచ్చిన ఆ కారు... క్రాఫర్డ్ మార్కెట్లోని సదానంద హోటల్ సమీపంలో మొదట ఇద్దరు మహిళలను ఢీకొట్టినట్లు తెలిపారు. ఆ ఇద్దరు మహిళలను జనతా కేఫ్ వరకూ కారు ఈడ్చుకొచ్చిందని చెప్పారు.
నలుగురిలో ముగ్గురు అక్కడికక్కడే...
కారు రోడ్డు పైనుంచి అదుపు తప్పి మొదట ఫుట్పాత్ పైకి దూసుకొచ్చిందని... ఆ తర్వాత జనతా కేఫ్ గోడను ఢీకొట్టిందని ఖురేషీ తెలిపారు. కారు వేగానికి ఆ గోడ మొత్తం బద్దలైపోయిందన్నారు. కారు మొదట సదానంద హోటల్ సమీపంలో ఇద్దరు మహిళలను ఢీకొట్టగా.. ఆ తర్వాత ఫుట్పాత్ పైకి దూసుకెళ్లి మరో ఇద్దరిని ఢీకొట్టినట్లు మరో ప్రత్యక్ష సాక్షి తెలిపారు. ఈ నలుగురిలో ముగ్గురు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలుస్తోంది.
మృతులు వీరే...
మృతులను సరోజా నాయుడు(65),జుబేదా అబ్దుల్ ఖాన్ (60)సైరా బాను(60)మహమ్మద్ నయిం(55)గా పోలీసులు గుర్తించారు. ఫుట్పాత్ పక్కనున్న షాపులో టీ తాగుతుండగా జుబేదాను కారు ఢీకొట్టిందని... అదే ఫుట్పాత్పై నడిచి వెళ్తున్న నయింను కూడా కారు ఢీకొట్టిందని పోలీసులు చెప్పారు. జనతా కేఫ్ సిబ్బంది ఒకరు మాట్లాడుతూ... ప్రమాద సమయంలో తాను కిచెన్లో ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నానని చెప్పారు. కారు ప్రమాదంతో పెద్ద శబ్దం రావడంతో బయటకు పరిగెత్తానని... అప్పటికే జనం చుట్టూ చేరి ఉన్నారని తెలిపారు.
ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో...
ప్రమాదంలో గాయపడ్డ ముస్తకీన్ షా మాట్లాడుతూ... 'నేను క్రాఫర్డ్ మార్కెట్లో పనిచేస్తాను. మా సోదరుడితో కలిసి ఇంటికెళ్తుండగా వెనక నుంచి దూసుకొచ్చిన ఓ కారు నన్ను ఢీకొట్టింది. దీంతో నేను కొన్ని మీటర్ల దూరంలో ఎగిరిపడి స్పృహ కోల్పోయాను. మా సోదరుడు నన్ను తక్షణం జేజే ఆస్పత్రికి తరలించాడు. ఆస్పత్రికి వెళ్లాకే నేను స్పృహలోకి వచ్చాను' అని చెప్పుకొచ్చారు. గాయపడ్డ నలుగురిలో ఆ కారు డ్రైవర్ సమీర్ డిగ్గీ కూడా ఉన్నట్లు చెప్పారు. సమీర్ డిగ్గీ గతంలోనూ ఓ ట్రక్కును ఢీకొట్టిన కేసులో బుక్కయ్యాడని చెప్పారు. అయితే ఆ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగలేదన్నారు.