తాజా అల్లర్లు: ముజాఫర్నగర్లో నలుగురు మృతి

బుధవారం పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనకు సంబంధించి ఎలాంటి ఆధారాలు తమకు లభించలేదని పోలీసులు తెలిపారు. మత సంబంధ ఘర్షణలతో ఈ ఘటనకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు చెప్పారు. సుమారు 600 మంది పారామిలటరీ దళాలు ఆ ప్రాంతంలో మోహరించి ఉన్నాయని, అల్లర్లను ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
హుస్సేన్పూర్, మహ్మద్పూర్ గ్రామాల మధ్య వ్యవసాయ భూమికి సంబంధించిన వివాదం జరిగిందని వారు తెలిపారు. ఈ వివాదం ఘర్షణకు దారితీసి ముగ్గురి ప్రాణాలను బలిగొందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మహ్మద్పూర్ గ్రామానికి చెందిన 8మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు ఉన్నతాధికారులు వివాదాన్ని నియంత్రించేందుకు ప్రయత్నించారు. ఇతర గ్రామాలకు అల్లర్లు వ్యాపించకుండా చర్యలు చేపట్టినట్లు, కొంత ఉద్రిక్తత ఉన్నప్పటికీ పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
మరో ఘటనలో హుస్సేన్పూర్ సమీపంలోని ఆస్పత్రికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఇద్దరు దంపతులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో మహిళ మృతి చెందగా.. ఆమె భర్తకు గాయాలయ్యాయి. ఘటనకు పాల్పడింది ఎవరనేది తెలియరాలేదని పోలీసులు తెలిపారు. గత నెలలో చోటుచేసుకున్న ఇలాంటి చిన్న ఘటనలే తీవ్ర అల్లర్లకు దారితీసిన నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.












Click it and Unblock the Notifications