సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ ఇంటి బయట అనుమానాస్పద వ్యక్తులు.. ఎవరు వారు ఎందుకొచ్చారు?
సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ నివాసం బయట నలుగురు వ్యక్తులు తచ్చాడుతూ కనిపించడంతో వర్మ భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. వారిని ప్రశాంత్ కుమార్, వినిత్ కుమార్ గుప్తా, అజయ్ కుమార్, ధీరజ్ కుమార్ సింగ్లుగా గుర్తించారు. వారి దగ్గర ఇంటెలిజెన్స్ బ్యూరో ఐడీ కార్డులు ఉన్నట్లు తెలిపారు. వారి దగ్గర నుంచి ఐడీ కార్డులు, సీజీహెచ్ఎస్, ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడిన నలుగురు వ్యక్తులనుంచి స్వాధీనం చేసుకున్న ఐడీ కార్డులపై వారు ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులుగా ఉందని వర్మ భద్రతా సిబ్బంది తెలిపారు. వారి దగ్గరు నుంచి స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నట్లు సిబ్బంది వెల్లడించింది. పట్టుబడిన వ్యక్తులు అలోక్ వర్మ ఇంటి ముందు ఇంటి వెనక ఉన్న గేట్ల నుంచి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అలోక్ వర్మ నివాసం అత్యంత భద్రత కలిగిన జనపత్ రోడ్డులో ఉంది. ఇంటిలోపలికి ప్రవేశించాలని ప్రయత్నించిన వ్యక్తులు రెండు కార్లలో వచ్చినట్లు సమాచారం.
ఉదయం నుంచి ఇంటికి సమీపంలో కొన్ని గంటలపాటు తచ్చాడుతూ అనుమానాస్పదంగా కనిపించారని భద్రతా సిబ్బంది తెలిపింది. ఇక అనుమానం బలపడటంతో వారిని జాగ్రత్తగా పట్టుకున్నామని అధికారులు వెల్లడించారు. ముందుగా వారిని వర్మ నివాసంలోని కాంపౌండ్లో ఉన్న పీఎస్ఓ ప్రశ్నించి ఆ తర్వాత పోలీస్ కంట్రోల్ రూంకు వీరిని అప్పగించారు. ఇదిలా ఉంటే వారు ఎవరో ఇంకా విచారణ చేస్తున్నామని ఢిల్లీ జిల్లా పోలీస్ కమిషనర్ మధుర్ వర్మ తెలిపారు. ఇది సెక్యూరిటీ విభాగం విచారణ చేస్తోందని తెలిపారు.