ఘోరం: కుప్పకూలిన బావి: 40 మంది..వాన నీటితో నిండుగా: రూ.5 లక్షల పరిహారం
భోపాల్: మధ్యప్రదేశ్లో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. భారీ వర్షాలకు ఓ బావి కుప్పకూలిన ఘటనలో సుమారు 40 మంది అందులో పడిపోయారు. వారిలో నలుగురు మరణించారు. మిగిలినవారిని కాపాడటానికి సహాయక సిబ్బంది శ్రమిస్తోన్నారు. వర్షపునీటితో బావి నిండుగా ఉండటం వల్ల మృతుల సంఖ్య మరంత పెరిగే ప్రమాదం ఉందని తెలుస్తోంది. ఇప్పటిదాకా 19 మందిని పోలీసులు, ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ సిబ్బంది కాపాడారు. వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించాయి.
మధ్యప్రదేశ్ విదిశ జిల్లాలోని గంజ్ బసోడా బ్లాక్ పరిధిలోని లాల్ పఠార్ గ్రామంలో గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. లాల్ పఠార్ గ్రామానికి చెందిన ఓ బాలుడు పొరపాటున ఆ బావిలో పడ్డాడు. అతన్ని బయటికి తీయడానికి స్థానికులు ప్రయత్నించారు. ఈ సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో బావి వద్దకు చేరుకుని.. దాన్ని తిలకించసాగారు. అప్పటికే ఆ బాలుడిని రక్షించే ప్రయత్నాలు మునిగి ఉన్నారు.

ఇదివరకు కురిసిన భారీ వర్షాల వల్ల బావి గోడలు దెబ్బతిన్నాయి. అదే సమయంలో సుమారు 50 మంది వరకు గ్రామస్తులు బావి అంచుల వద్ద నిల్చోవడంతో ఆ బరువుకు బావి గోడలు తట్టుకోలేకపోయాయి. ఒక్కసారిగా చెదిరిపోయాయి. బావి కుప్పకూలింది. అంచుల వద్ద నిల్చున్న వారిలో 40 మంది బావిలో పడ్డారు. వారిలో కొందరు పిల్లలు కూడా ఉన్నారు. ఒకేసారి ఇంతమంది బావిలో పడ్డ సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు, ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
జేసీబీలను రప్పించారు. బావిలో పడిన వారిని యుద్ధ ప్రాతిపదికన వెలికి తీయడానికి సహాయక చర్యలు చేపట్టారు. రాత్రి నుంచి నిరంతరాయంగా కొనసాగుతోన్న సహాయక చర్యల్లో ఇప్పటిదాకా 19 మందిని వెలికి తీశారు. ఈ ఘటనలో నలుగురు మరణించారు. వారి మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని, పోస్ట్మార్టమ్ కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించింది. మృతుల కుటుంబానికి నష్టపరిహారాన్ని ప్రకటించింది.
మృతుల కుటుంబాలకు అయిదు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లిస్తామని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. గాయపడ్డ వారికి ఉచితంగా వైద్య సహాయం అందిస్తామని అన్నారు. ఈ ఘటన పట్ల ఆయన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. ప్రాణనష్టాన్ని నివారించేలా తక్షణ చర్యలను తీసుకోవాలని ఆదేశించారు. విదిశ జిల్లా కలెక్టర్, పోలీస్ సూపరింటెండెంట్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక పనులను పర్యవేక్షిస్తోన్నారు.












Click it and Unblock the Notifications