ముంబై పాఠశాల టాయిలెట్లో నాలుగేళ్ల బాలికపై అత్యాచారం
ముంబై: కర్ణాటక రాజధాని బెంగళూరు పాఠశాలల ఘటనలను మరిచిపోక ముందే మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఓ పాఠశాలలో బాలికపై దారుణం జరిగింది. ముంబై శివారులోని బందూప్ పాఠశాలలో నాలుగేళ్ల బాలికపై అత్యాచారం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలకు సంబంధించి పోలీసులు పాఠశాల బోధనేతర సిబ్బందికి చెందిన ఓ ఉద్యోగిని అరెస్టు చేశారు.
బాలికపై అత్యాచారం జరిగిందనే ఆరోపణలతో ఆగ్రహించిన కొంత మంది పాఠశాల వద్ద నిరసనకు దిగారు. పాఠశాల ఆస్తులను ధ్వంసం చేసినట్లు పోలీసులు తెలిపారు. జూనియర్ కెజీ విద్యార్థినిపై కేసరి ఉపాధ్యాయ్ అనే నాన్ టీచింగ్ స్టాఫ్కు చెందిన ఉద్యోగి లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. పాఠశాల టాయిలెట్లో డిసెంబర్ 9వ తేదీన అతను ఆ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
ఆ తర్వాత సంఘటన గురించి బాలిక తన కుటుంబ సభ్యులకు వివరించింది. మంగళవారంనాడు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని పోలీసులు బుధవారంనాడు అరెస్టు చేశారు. బందూప్ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్స్పెక్టర్ ప్రతాప్ చవాన్ ఆ విషయం చెప్పారు.
సంఘటనపై ఆగ్రహించిన కొంత మంది పాఠశాల వెలుపల నిరసన వ్యక్తం చేశారని, ఆ తర్వాత పాఠశాలలోకి చొరబడి విధ్వంసానికి పాల్పడ్డారని, పరిస్థితిని అదుపులోకి తెచ్చామని ఆయన చెప్పారు.