షాకింగ్ సర్వే : లాక్ డౌన్ ఎఫెక్ట్ ఎంతలా ఉంది... ఇంకా రేషన్ అందని జనమెంత..?
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే వలస కార్మికులు,పేదలకు ఎటువంటి భరోసా ఇవ్వకుండానే లాక్ డౌన్ ప్రకటించడంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఢిల్లీ నుంచి వేలాది వలస కార్మికులు హైవేలపై ఒక ప్రవాహంలా పోటెత్తడం వారి దీనస్థితికి అద్దం పట్టింది. దీంతో కేంద్రం రంగంలోకి దిగి వచ్చే మూడు నెలల పాటు పేదలకు ఉచిత రేషన్ను ప్రకటించింది. తక్షణ చర్యల కింద తీసుకున్న ఈ నిర్ణయం క్షేత్రస్థాయిలో సరిగా అమలవుతోందా..? తాజా సర్వే దీనిపై ఎలాంటి వివరాలు బయటపెట్టిందో పరిశీలిద్దాం..
సర్వే రిపోర్ట్..
ప్రభుత్వేతర సంస్థ జాన్ సహాస్ భారత్లో రేషన్ సరుకుల పంపిణీపై సర్వే నిర్వహించింది. టెలిఫోన్ ద్వారా నిర్వహించిన ఈ సర్వేలో 3196 మంది వలస కార్మికుల నుంచి కూడా వివరాలు సేకరించారు. సర్వే ప్రకారం.. లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి ఇప్పటికీ దేశంలో 42 శాతం ప్రజలకు ప్రభుత్వం నుంచి రేషన్ సరుకులు అందలేదు. అలాగే లాక్ డౌన్ కారణంగా దాదాపు 92.5శాతం మంది కార్మికులు మూడు వారాలుగా పని కోల్పోయారు. లాక్ డౌన్ 21 రోజుల కంటే ఎక్కువ రోజులు కొనసాగితే.. కుటుంబ పోషణ,ఖర్చులు తమవల్ల కాదని 66శాతం మంది వెల్లడించారు.
ఇప్పటికీ గమ్య స్థానాలకు చేరుకోనివాళ్లు..
సర్వేలో పాల్గొన్న మూడొంతుల మందిలో ఒక వంతు మంది ఇప్పటికీ తమ గమ్య స్థానాలకు చేరుకోలేదని తేలడం గమనార్హం. తిండి,నీళ్లు,డబ్బు ఇవేవీ లేక వారంతా తీవ్ర సమస్యలను ఎదుర్కొనట్టు తేలింది. ఇక సగం మంది వలస కార్మికులు ఇప్పటికే తమ గ్రామాలకు చేరుకున్నారని.. అయితే చేతిలో డబ్బు లేక,రేషన్ అందక వారు ఇబ్బందిపడుతున్నారని వెల్లడైంది. లాక్ డౌన్ కారణంగా ఉపాధి లేకపోవడంతో వేతనాలు వచ్చే పరిస్థితి లేదని.. తీసుకున్న రుణాలు ఎలా చెల్లించాలో అర్థం కావట్లేదని 31శాతం మంది కార్మికులు వాపోయారు. ఇందులో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నవారి కంటే ప్రైవేట్ వ్యక్తుల నుంచి రుణాలు తీసుకున్నవారే మూడు రెట్లు ఎక్కువగా ఉన్నట్టు తేలింది.
రుణాలు చెల్లించకపోతే దాడులు జరుగుతాయేయోనన్న భయం..
రుణాలు తీసుకున్నవారిలో 79శాతం మంది.. వాటిని ఇప్పట్లో తిరిగి చెల్లించలేమని సర్వేలో వెల్లడించారు.అంతేకాదు,రుణాలు తిరిగి చెల్లించకపోవడం వల్ల తమపై ఎక్కడ దాడులు జరుగుతాయోనన్న భయం వెంటాడుతుందని చెప్పారు. మార్చి 24న కేంద్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు రిలీఫ్ ఫండ్ ప్రకటించినప్పటికీ.. క్షేత్ర స్థాయిలో 94శాతం మంది భవన నిర్మాణ కార్మికులకు ఎటువంటి ఐడీ కార్డు లేదని వెల్లడవడం గమనార్హం. దీంతో ప్రభుత్వం అందించే రిలీఫ్ ఫండ్ వీరికి అందే అవకాశం కనిపించలేదు. దాదాపు 55శాతం మంది కార్మికులు రోజుకు రూ.200-రూ.400 సంపాదించేవారే ఎక్కువగా ఉన్నారని.. మరో 39శాతం మంది రోజుకు రూ.400-రూ.600 సంపాదించేవారు ఉన్నారని తేలింది.