మురికివాడకు గోడ కట్టి వదల్లేదు.. గుడిసెలనూ ఖాళీ చేయించారు.. గుజరాత్లో ‘ట్రంప్’కు ఏర్పాట్లు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాక సందర్భంగా భారీ ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేస్తోన్న గుజరాత్ ప్రభుత్వం.. ట్రంప్ కాన్వాయ్ ప్రయాణించే మార్గంలో మురికివాడలు కనిపించకుండా గోడలు నిర్మించిన సంగతి తెలిసిందే. అంతటితో వదిలేయకుండా, ఇప్పుడు గుడిసెల వాసుల్ని కూడా ఖాళీ చేయించడం వివాదాస్పదమవుతోంది. ఈనెల 24న అహ్మదాబాద్ లో అడుపెట్టనున్న ట్రంప్.. ప్రధాని మోదీతో కలిసి ప్రపంచంలోనే అతిపెద్దదైన క్రికెట్ స్టేడియాన్ని ప్రారంభించనున్నారు. ఆ స్టేడియం చుట్టుపక్కల మురికివాడల్లో నివసిస్తోన్న బడుగుజీవుల్ని అధికారులు వేరే చోటికి తరలించారు.

గుడెసెలకు నోటీసులు..
అమెరికాలోని హ్యూస్టన్ లో నిర్వహించిన ‘హౌదీ మోదీ' తరహాలోనే అహ్మదాబాద్ లోని సర్దార్ పటేల్ స్టేడియం(మోతేరా స్టేడియం)లో ‘నమస్తే ట్రంప్' కార్యక్రమాన్ని తలపెట్టారు. ఈ నెల 24న ట్రంప్.. గాంధీజీ సబర్మతి ఆశ్రమాన్ని దర్శించిన తర్వాత మోడీతో కలిసి స్టేడియంలోకి అడుపెట్టనున్నారు. ఈ స్టేడియంను ఆనుకునిఉన్న ఓ మురికివాడలోని గుడిసెల్లో సుమారు 50 కుటుంబాలు గత ఇరవై ఏళ్లుగా జీవనం సాగిస్తున్నాయి. వాళ్లందరినీ తక్షణమే ఖాళీ చేయాలంటూ అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(ఏఎంసీ) సోమవారం నోటీసులు జారీచేసింది.

పేదల గగ్గోలు..
వెంటనే గుడిసెలు వదిలి వెళ్లిపోవాలంటూ ఏఎంసీ అధికారులు నోటీసులివ్వడంతో మురికివాడలోని పేదలు గగ్గోలు పెట్టారు. రోజువారీ కూలీ పనులు చేసుకుని బతికే తాము ఎక్కడికీ వెళ్లలేమని, అక్కడే ఉంటామని వేడుకున్నారు. దీంతో స్టేడియానికి దూరంగా ఓ బిల్డింగ్ లో వసతి ఏర్పాటు చేస్తామని, ట్రంప్ పర్యటన ముగిసిన తర్వాత మళ్లీ గుడిసెలకు రావొచ్చని అధికారులు హామీ ఇచ్చినట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.

స్లమ్ గోడపై అందమైన బొమ్మలు..
ట్రంప్ కవాన్వాయ్ ఎయిర్ పోర్టు నుంచి స్టేడియానికి వచ్చే దారిలో ఉన్న దేవ్ శరణ్ మురికివాడ కనిపించకుండా భారీ గోడను నిర్మించిన అహ్మదాబాద్ కార్పొరేషన్... ఆ గొడపై అందమైన బొమ్మలు చిత్రించింది. పదుల సంఖ్యలో ఆర్టిస్టులు రేయింబవళ్లు పనిచేస్తూ, ఆ గోడపై ట్రంప్, మోదీ, ఇండియాతో అమెరికా అనుబంధాన్ని ప్రతిబింబించే బొమ్మల్ని గీశారు. గోడ నిర్మాణంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.

సివిక్ రిసెప్షెన్ కోసమే..
ప్రపంచ పెద్దన్న అమెరికాకు ప్రెసిడెంటైన డొనాల్డ్ ట్రంప్, ఫస్ట్ లేడీ మెలానియాకు ఇండియా పర్యటన జీవితంలో మర్చిపోలేని అనుభూతి అవుతుందని, ఆ మేరకు తాను హామీ ఇస్తున్నానని ప్రధాని నరేంద్ర మోదీ గతంలో ప్రకటించారు. ఆమేరకు కేంద్రం, గుజరాత్ సర్కారు ప్రపంచ పెద్దన్న కోసం లక్షలాదిమందితో ''సివిక్ రిసెప్షెన్''ను తలపెట్టింది. కాగా, మురికివాడలు కనిపించకుండా గోడలు, గుడిసెల వాసుల తరలింపు ప్రక్రియ భద్రతా కారణాలతోనే చేపట్టినట్లు ప్రభుత్వం వాదిస్తోంది.












Click it and Unblock the Notifications