జమ్ముకశ్మీర్ ఓటర్ల జాబితాలో 5 లక్షల కొత్త ఓటర్లు-స్ధానికేతరుల వివాదం నేపథ్యంలో..
జమ్ముకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక్కడ స్ధానిక పార్టీలైన నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీతో పాటు జాతీయ పార్టీ కాంగ్రెస్, ఇతర పార్టీల్ని కాదని బీజేపీని ఎలాగైనా అధికారంలోకి తెచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్టికల్ 370 రద్దుతో స్ధానికేతరులు కూడా కశ్మీర్ లోకి స్ధిరపడేందుకు, ఆస్తులు కొనుక్కునేందుకు అవకాశం దక్కింది.దీంతో పెద్ద ఎత్తున తమకు అనుకూలమైన వారిని బీజేపీ తరలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది.
జమ్ముకశ్మీర్ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా నియోజకవర్గాల పునర్విభజన, ఓటర్ల జాబితా సవరణ వంటి చర్యలు తీసుకుంటున్నారు. ఇదే క్రమంలో ఓటర్ల జాబితాలోకి భారీ ఎత్తున ఓటర్లను చేరుస్తున్నారు. తాజా సవరణల తర్వాత ఓటర్ల జాబితాలోకి కొత్తగా 5 లక్షల మంది ఓటర్లు చేరడంతో స్ధానికేతరుల వివాదం మరోసారి తెరపైకి వస్తోంది. బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు వీలుగా బయటివారిని పెద్ద ఎత్తున ఓటర్లుగా నమోదు చేయించినట్లు స్ధానిక పార్టీలు ఆరోపిస్తున్నాయి.
ఇప్పటివరకూ జమ్ముకశ్మీర్ మొత్తం మీద 78.44 లక్షల ఓటర్లుండగా.. ఇప్పుడు తాజాగా చేరిన 5.1 లక్షల మందితో కలుపుకుని మొత్తం ఓటర్ల సంఖ్య 83.59 లక్షలకు చేరింది. దీంతో అక్కడ ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైందని భావిస్తున్నారు. అయితే వచ్చే ఏడాది మార్చిలోపు ఇక్కడి మంచు పరిస్ధితుల దృష్ట్యా ఎన్నికలు నిర్వహించే పరిస్దితులు కనిపించడం లేదు. కానీ రాజకీయ పార్టీలు మాత్రం త్వరగా ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘంపై ఒత్తిడి పెంచుతున్నాయి. అలాగే కొత్త ఓటర్లపైనా అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నాయి.