ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు: కోవిడ్ టాస్క్ ఫోర్స్తో ఈసీ భేటీ, బహిరంగసభలు, ర్యాలీలు బంద్!
న్యూఢిల్లీ: దేశంలో ఓ వైపు కరోనా వైరస్, ఒమిక్రాన్ వేరియంట్ కేసులు భారీగా పెరుగుతున్న క్రమంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఇప్పుడు ఎన్నికల సంఘానికి సవాలుగా మారింది. ప్రస్తుతం దేశంలో నెలకొన్న కరోనా పరిస్థితులను ఎన్నికల సమయానికి వివరించేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు గురువారం మరోసారి భేటీ అయ్యారు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఉధృతి, కరోనా కేసుల పెరుగుదలపై ముఖ్యంగా చర్చించారు.
ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ బహిరంగ సభలు, ర్యాలీలకు అనుమతి ఇవ్వకూడదని ఈసీకి సూచించినట్లు తెలిసింది. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్న క్రమంలో తాజా పరిస్థితులపై కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ తోపాటు నీతిఆయోగ్ సభ్యుడు(ఆరోగ్యం) డాక్టర్ వీకే పాల్, ఇతర ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఈసీకి వివరించినట్లు తెలిసింది.
ఐదు రాష్ట్రాల్లోనూ షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ఇప్పటికే ఎన్నికల సంఘం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కరోనా నిబంధనలకు అనుగుణంగా పోలింగ్ ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చింది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో పర్యటించి పరిస్థితులను అంచనా వేసింది. దేశ వ్యాప్తంగా కరోనా పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతోంది.
కొన్ని రోజులుగా కరోనావైరస్ విజృంభిస్తున్న క్రమంలో కేంద్ర ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో తాజాగా మరోసారి భేటీ అయ్యింది. ఎన్నికల ప్రచారం, నిర్వహణ, కౌంటింగ్ సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర ఆరోగ్యశాఖ, కోవిడ్ టాస్క్ ఫోర్స్ నుంచి పలు సూచనలు స్వీకరించింది.
కాగా, ఉత్తరప్రదేశ్ తోపాటు ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్ రాష్ట్రాలకు మరికొన్ని నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఇందుకు సంబందించి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. అయితే, గత కొన్ని రోులుగా ఆయా రాష్ట్రాల్లో పర్యటించిన ఈసీ బృందాలు.. అక్కడ అన్ని రాజకీయ పార్టీల నేతలతో భేటీ అయ్యింది. ఎన్నికలు వాయిదా వేయొద్దని పార్టీలు కోరాయని, అందుకే యూపీ సహా ఐదు రాష్ట్రాల్లోనూ షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.