తమిళనాడులో భారీ వర్షాలు: ఐదు మంది మృతి, చెన్నై రోడ్లు చెరువులు, 5 రోజులు అంతే, సెలవులు!
చెన్నై: తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తుండంతో జనజీవనం అస్తవ్యస్థం అయ్యింది. చెన్నై నగరంలో భారీ వర్షాల కారణంగా రోడ్లు జలమయం అయ్యాయి. చెన్నై నగరంలోని అనేక రహదారులు చెరువుల్లా మారిపోయాయి. భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు ఐదు మంది మరణించారని అధికారులు చెప్పారు.
భారీ వర్షాల కారణంగా పురాతన భవనం కుప్పకూలడంతో ఇద్దరు మరణించారు. ఒక రైతుతో పాటు ఇద్దరు సామాన్య పౌరులు మరణించారు. భారీ వర్షాల కారణంగా చెన్నై నగరంలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. బంగాళఖాతంలో నైరుతి దిశగా శ్రీలంక సమీపంలో ఉపరితల అవర్తనంగా నిలిచిందని చెన్నైలోని వాతావరణ పరిశోధన కేంద్రం ప్రకటించింది.
Recommended Video


ఐదు రోజులు భారీ వర్షాలు
చెన్నైలోని వాతావరణ పరిశోధన కేంద్రం డైరెక్టర్ బాలచంద్రన్ మీడియాతో మాట్లాడుతూ బంగాళఖాతంలో ఉపరితల కేంద్రీకృతమై నిలకడగా ఉందని అన్నారు. దీని ప్రభావం రాబోయే 48 గంటల్లో సముద్రతీర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని బాలచంద్రన్ అన్నారు.

అన్ని జిల్లాల్లో అప్రమత్తం
చెన్నై, తిరువళ్లారు, కాంచీపురం, విళుపురం, కడలూరు, నాగపట్టణం, తిరువారూరు, తంజావూరు, రామనాథపురం, కాంచీపురం తదితర జిల్లాతో పాటు పుదుచ్చేరీలో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు ప్రకటించారు. తమిళనాడులోని సముద్రతీర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు.

ప్రజలు జాగ్రత్త
తమిళనాడులో నవంబర్ 3వ తేదీ వరకు భారీ వర్షాలు పడుతాయని వాతావరణ పరిశోధన కేంద్రం ప్రకటించడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. చెన్నై నగరంలో వర్షం నీటిని రోడ్ల మీద నుంచి తొలగించడానికి చర్యలు తీసుకుంటున్నారు. సెలవుల్లో ఉన్న కార్పొరేషన్ సిబ్బంది, అధికారులు వెంటనే విధులకు హాజరుకావాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

చెన్నై రోడ్లు చెరువులు
చెన్నై నగరంలోని అనేక ప్రాంతాల్లోని రహదారులు చెరువుల్లా మారిపోయాయి. ద్విచక్ర వాహన చోదకులు కార్యాలయాలు, ఇళ్లు చేరుకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇద్దరు ద్విచక్ర వాహనచోదకులు భారీ వర్షాల కారణంగా గల్లంతు అయ్యారు.గల్లంతు అయిన ఇద్దరి కోసం అధికారులు, సిబ్బంది గాలిస్తున్నారు.

అయ్యా ఆన్నం పెట్టండి
చెన్నై నగరంలో ఫ్లాట్ ఫారంపై జీవించే పేదలు రోడ్లు జలమయం కావడంతో పార్కులు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఆశ్రయం పొందుతున్నారు. అన్నం వండుకునే అవకాశం లేకపోవడంతో ఆకలి తీర్చమంటూ దారినపోయే వారిని వేడుకుంటుంన్నారు.అనేక మంది ఆకలితో నానా ఇబ్బందులు పడుతున్నారు.

విద్యా సంస్థలు బంద్
తమిళనాడులో భారీ వర్షాల కారణంగా చెన్నై నగరంతో పాటు తిరువళ్లూరు, కాంచీపురం, కన్యాకుమారి, తంజావూరు, రామనాథపరం తదితర జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ముందు జాగ్రత్త చర్యగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని అధికారులు మనవి చేశారు.

25 విమానాలు ఆలస్యం
చెన్నై నగరంలో భారీ వర్షాల కారణంగా రోడ్ల మీద ట్రాఫిక్ మాత్రమే కాదు విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు ఎదుర్కున్నారు. విమాన పైలెట్లు, ఎయిర్ హోస్టెస్ లు ట్రాఫిక్ లో చిక్కుకుని సరైన సమయానికి విమానాశ్రయం చేరుకోలేకపోయారు. చెన్నై నుంచి ముంబై, ఢిల్లీ, పూనే, కోయంబత్తూరు, మధురై, దుబాయ్, కొలంబో, అండమాన్ వెళ్లే 25 విమానాలు సుమారు గంట ఆలస్యంగా బయలుదేరాయి.












Click it and Unblock the Notifications