డాక్టర్లను కబళిస్తున్న కరోనా... దేశంలో ఒక్కరోజే 50 మంది వైద్యులు మృతి... ప్రమాదకర పరిస్థితులు...
ప్రాణాలు రిస్క్ చేసి మరీ కరోనా కాలంలో వైద్య సేవలందిస్తున్న వైద్యులు సైతం మహమ్మారి కాటుకు బలైపోతున్నారు. అసలే దేశంలో జనాభాకు తగ్గ వైద్యుల సంఖ్య లేని నేపథ్యంలో... ఇప్పుడున్న వైద్యులను కాపాడుకోలేకపోతే పరిస్థితులు మరింత దారుణంగా మారుతాయి. ఈ ఏడాది కరోనా సెకండ్ వేవ్ మొదలైన నాటి నుంచి ఇప్పటివరకూ దాదాపు 244 మంది వైద్యులను మహమ్మారి బలితీసుకుంది. ఇందులో ఆదివారం(మే 16) ఒక్కరోజే దేశవ్యాప్తంగా దాదాపు 50 మంది వైద్యులు కరోనా కారణంగా మృతి చెందారు.
అత్యధికంగా బిహార్లో...
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రకారం... ఈ ఏడాది ఏప్రిల్లో కరోనా రెండో వేవ్ మొదలైన నాటి నుంచి ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 244 మంది వైద్యులు మృతి చెందారు. అత్యధికంగా బిహార్లో 69 మంది,ఉత్తరప్రదేశ్లో 34 మంది,ఢిల్లీలో 27 మంది వైద్యులు మృతి చెందారు. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టి ఐదు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ 66శాతం మంది హెల్త్ కేర్ సిబ్బందికి మాత్రమే వ్యాక్సిన్ ఇచ్చారు. దేశవ్యాప్తంగా కేవలం 3శాతం మంది వైద్యులకు మాత్రమే రెండు డోసుల వ్యాక్సిన్ ఇచ్చారు.
అత్యంత దురదృష్టకరం : ఐఎంఏ
ఐఎంఏ(ఇండియన్ మెడికల్ అసోసియేషన్) జనరల్ సెక్రటరీ డా.జయేశ్ లీ మాట్లాడుతూ... ఆదివారం(మే 16) ఒక్కరోజే దేశవ్యాప్తంగా 50 మందిని వైద్యులను కోల్పోయామని చెప్పారు. ఇది అత్యంత దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఇప్పటివరకూ చాలామంది వైద్యులు ఇంకా వ్యాక్సినేషన్ తీసుకోలేదని అన్నారు. వైద్యులకు వ్యాక్సినేషన్ విషయంలో ఐఎంఏ చొరవ చూపుతుందని తెలిపారు. నిజానికి వైద్యుల కొరత కారణంగా ఉన్న వైద్యులపై విపరీతమైన ఒత్తిడి నెలకొందని చెప్పారు.
అసలు లెక్క ఎక్కువే ఉండవచ్చు...
ఒక్కో వైద్యుడు కొన్నిసార్లు ఏకధాటిగా 48 గంటల పాటు పనిచేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని జయేశ్ లీ వెల్లడించారు. అసలే తీవ్రమైన పని భారం... ఇలాంటి తరుణంలో కరోనా బారినపడితే మరణం సంభవించే ప్రమాదం పెరుగుతోందని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం హెల్త్ కేర్ సిబ్బంది సంఖ్యను పెంచే విషయంపై దృష్టి సారించాలన్నారు. గతేడాది కరోనా మొదటి వేవ్లో వెయ్యి మంది వైద్యులు చనిపోగా రెండో వేవ్లో ఇప్పటివరకూ 244 మంది వైద్యులు చనిపోయినట్లు చెప్పారు. నిజానికి ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండవచ్చునన్నారు. భారత్లో ప్రస్తుతం 12లక్షల పైచిలుకు వైద్యులు ఉండగా... ఇందులో 3.5లక్షల మంది మాత్రమే ఐఎంఏలో రిజిస్టర్ అయి ఉన్నారు. కేవలం ఐఎంఏలో రిజిస్టర్ కాబడి కరోనాతో మృతి చెందిన వైద్యుల డేటా మాత్రమే ఐఎంఏ వద్ద ఉన్నది.