భారత్ లోకి చొరబడ్డ 51 మంది ఉగ్రవాదులు.. ఏం జరుగుతోంది?
జమ్ము కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత భారత ప్రభుత్వం ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమవుతోంది. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే ప్రధాని మోదీ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన, వెనక ఉండి సహకారం అందించిన అందర్నీ వదిలి పెట్టే ప్రసక్తే లేదని.. ఉగ్రవాదులను మట్టిలో కలిపే సమయం ఆసన్నమైందని హెచ్చరికలు జారీ చేశారు.
ప్రధాని మోదీ వ్యాఖ్యలతో అటు పాకిస్థాన్ అప్రమత్తమైంది. సరిహద్దుకు బలగాలను మోహరిస్తోంది. ఇప్పటికే పాకిస్థాన్ సైనికులకు సెలవులను రద్దు చేసింది. దీంతో జమ్ము కాశ్మీర్ సరిహద్దులో యుద్ధవాతావరణం ఏర్పడింది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఇరు దేశాల ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు. మరో రెండు మూడు రోజుల్లో కీలక పరిణామాలు జరిగే అవకాశం ఉందని సమాచారం.
అయితే ఏటా భారత్ లోకి అనేక మంది ఉగ్రవాదులు చొరబడుతుండటం కేంద్ర ప్రభుత్వానికి సవాల్ గా మారింది. ఇప్పటికే భారత్ లో అక్రమంగా 122 మంది దాకా విదేశీ ఉగ్రవాదులు నక్కి ఉన్నట్లు ఓ సంచలన సర్వే బయటకు వచ్చింది. వీరంతా సిరియాలో ట్రైనింగ్ తీసుకున్నవాళ్లే కావడం భయానక వాతావరణాన్ని తలపిస్తోంది. ఇక గత ఏడాది జమ్ము కాశ్మీర్ మీదుగా పాకిస్థాన్ నుంచి భారత్ లోకి 51 మంది ఉగ్రవాదులు అక్రమంగా ప్రవేశించినట్లు లెక్కలు ఉన్నాయి.
ఈ 122 మంది ఉగ్రవాదులు భారత్ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని సరిహద్దు ప్రాంతాల్లో స్థావరాలు ఏర్పరచుకుని ఉన్నట్లు సంచలన నివేదకలో తేలింది. ఇక వీళ్లంతా సిరియాలోని ఐసిస్ శిక్షణ కేంద్రాల్లో ట్రైనింగ్ తీసుకున్నవారే కావడంతో భారత్ కఠిన చర్యల దిశగా అడుగులు వేస్తోంది. వీళ్లను ఎట్టిపరిస్థితుల్లోనూ ట్రాప్ చేసి మట్టిలో కలిపేయాలని ప్రణాళికలు వేస్తోంది. అంతేకాక గతంలో జరిపిన ఉరి సర్జికల్ స్ట్రైక్ మాదిరి మరోసారి ప్లాన్ చేస్తోంది.
ఉరి సర్జికల్ స్ట్రైక్ 2016లో పాక్ ఆక్రమిత కశ్మీర్ లో భారత సైన్యం చేసిన ఒక సైనిక చర్య. ఇది ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని చేసింది. 2016 సెప్టెంబర్ లో ఉరిలో భారత సైనిక శిబిరంపై ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా ఈ దాడి జరిగింది. అయితే తాజాగా పహల్గాం ఉగ్రదాడి ఘటనతో మళ్లీ అలాంటి సర్జికల్ స్ట్రైక్ కు ప్రధాని మోదీ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.

అదే కానీ జరిగితే పాకిస్థాన్ సరిహద్దుల్లోని ఉగ్రమూకలను ఏరి పారేయవచ్చని కాశ్మీర్ కు చెందిన మాజీ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఉగ్రమూకలను మట్టిలో కలిపేస్తామని ప్రధాని మోదీ శపథం చేశారు. దీంతో అతి త్వరలోనే భారత్- పాక్ మధ్య మునుపెన్నడూ చూడని కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయని అర్థం అవుతోంది. ఇప్పటికే మోదీ ప్రభుత్వం 5 సంచలన నిర్ణయాలు తీసుకుంది. పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థపై దెబ్బ కొట్టింది. త్వరలో మరిన్ని కఠిన చర్యలు తీసుకుని పాకిస్థాన్ ను అష్టదిగ్భందనం చేయాలని ప్రధాని మోదీ ప్రభుత్వం సిద్ధమవుతోంది.












Click it and Unblock the Notifications