రూ.55 కోట్ల కరెంట్ బిల్లు: షాక్లో కుటుంబం, సస్పెండ్
రాంచీ: కుటుంబ సభ్యుల పెళ్లికి వెళ్లి ఇంటికి వచ్చిన ఓ యజమానిని నివ్వెరపోయెలా చేసింది కరెంట్ బిల్లు. వివరాల్లోకి వెళితే, రాంచీలో ఉంటున్న కృష్ణ ప్రసాద్ అనే ఓ వ్యక్తి కొన్ని రోజుల క్రితం ఓ పెళ్లి వేడుకకు కుటుంబ సభ్యలతో కలిసి వెళ్లాడు.
తిరిగి వచ్చిన తర్వాత కరెంట్ బిల్లుని చూసి ఒక్కసారిగా అవాక్కయ్యాడు. కృష్ణ ప్రసాద్ ఇంటి నెలసరి కరెంట్ బిల్లు ఎంతో తెలుసా? అక్షరాలా రూ.55 కోట్ల, 49 లక్షల, 88 వేల 36 రూపాయిలు. దీంతో ఎలక్ట్రిసిటీ అధికారుల తప్పిదాన్ని వేలేత్తి చూపుతూ కృష్ణ ప్రసాద్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.
అంతేకాదు ఈ కరెంట్ బిల్లుని చూసి తన 55 ఏళ్ల తల్లి గుండె ఆగినంత పనైందని ప్రసాద్ తెలిపాడు. డాక్టర్ వద్దకు కూడా తీసుకెళ్లానని తెలిపాడు. ఈ తప్పుడు బిల్లుపై తాను కోర్టుకు వెళతానని స్సష్టం చేశాడు. కేవలం ఐదుగురు సభ్యులు మాత్రమే ఉంటున్న రెండు గదుల ఇంటికి ఇంతటి బిల్లు రావడంపై తీవ్ర ఆందోళన చెందినట్లు ప్రసాద్ తెలిపాడు.
ఎండ వేడిమి భరిస్తున్నామని, తన ఇంటిలో కనీసం ఎయిర్ కండీషనర్ను కూడా లేదన్నాడు. వేసవి కావడంతో చాలా ప్రాంతాల్లో 7-8 గంటల పాట పవర్ కట్ కూడా ఉంటే, కోట్లలో బిల్లు రావడమేమటని ప్రశ్నిస్తున్నాడు.
ఇదిలా ఉండగా ఈ ఘటనపై జార్ఖండ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్ మెంట్ ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేసింది. ఇది కేవలం సాంకేతిక తప్పిదమేనని అంగీకరించింది. కరెంట్ బిల్లుల పంపిణీ మొత్తాన్ని ఒక ప్రైవేట్ సంస్ధకు అవుట్ సోర్సింగ్ ఇచ్చామని, అధికారులు దీనిపై దర్యాప్తు చేస్తారని తెలిపారు.