శ్రీ సిమెంట్ ఫ్యాక్టరీలో కుప్పకూలిన క్రేన్, ఆరు మంది దుర్మరణం, కార్మికుల పరిస్థితి !
Recommended Video
బెంగళూరు: సిమెంట్ ఫ్యాక్టరీలో క్రేన్ కుప్పకూలి పోవడంతో ఆరు మంది దుర్మరణం చెంది అనేక మందికి తీవ్రగాయాలు అయిన ఘటన కర్ణాటకలోని బీదర్ సమీపంలో జరిగింది. సేడం తాలుకా కోడ్లాలోని శ్రీ సిమెంట్ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం జరిగింది.
గురువారం రాత్రి కోడ్లాలోని శ్రీ సిమెంట్ ఫ్యాక్టరీలో కార్మికులు వారి పనుల్లో వారు నిమగ్నం అయ్యారు. ఆ సమయంలో కొందరు కార్మికులు వెల్డింగ్ పనులు చేస్తున్నారు. అదే సమయంలో విపరీతమైన వర్షం, భారీగా గాలులు రావడంతో క్రేన్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.
ఈ ప్రమాదంలో తబారక్ అనే కార్మికుడు సంఘటనా స్థలంలో దుర్మరణం చెందాడు. తీవ్రగాయాలైన జుబీర్, సుధాకర్, పిటి. కాంచన్, నితిన్, అజయ్ అనే కార్మికులను కలబురిగిలోని యునైటెడ్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై ఐదు మంది శుక్రవారం వేకువ జామున మరణించారు.
అనేక మంది కార్మికులకు తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు అంటున్నారు.
భారీగా వర్షాలు, విపరీతమైన గాలులు రావడం వలనే క్రేన్ కుప్పకూలిపోయిందని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. మృతులు అందరూ బీహార్ కు చెందిన వారని పోలీసులు అన్నారు. శుక్రవారం మృతదేహాలకు పోస్టుమార్టుం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని, కేసు విచారణలో ఉందని సేడం పోలీసులు తెలిపారు.