సువేందు దూకుడు..! బంగ్లా బోర్డర్లో కంచెకు 600 ఎకరాలు-6 కీలక నిర్ణయాలు..!
పశ్చిమ బెంగాల్లో తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసి సీఎం అయిన సువేందు అధికారి (Suvendu Adhikari) తన మార్కు దూకుడు మొదలుపెట్టేశారు. ముఖ్యంగా మమతా బెనర్జీ ప్రభుత్వం గత కొన్నేళ్లుగా అమలు చేయకుండా మూలనపడేసిన ప్రాజెక్టుల దుమ్ము దులుపుతున్నారు. కేంద్రంతో వైరం కారణంగా మమత పట్టించుకోని బంగ్లాదేశ్ సరిహద్దులో కంచె ఏర్పాటు వ్యవహారంపైనా కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఇవాళ తొలిసారి కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసిన సీఎం సువేందు అధికారి .. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కంచె ఏర్పాటు కోసం బీఎస్ఎఫ్ కు 600 ఎకరాల భూమి బదలాయింపు 45 రోజుల్లో చేపట్టాలని నిర్ణయించారు. అలాగే రాష్ట్రంలో ఇంకా ప్రారంభం కాని జనగణన ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని నిర్ణయించారు. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని వెంటనే అమలు చేసేలా ఆదేశాలు ఇచ్చారు.

రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్, డబ్ల్యూబీపీఎస్ అధికారులను శిక్షణ కోసం ఇతర రాష్ట్రాలకు గతంలో మమతా బెనర్జీ ప్రభుత్వం పంపలేదు. దీన్ని మార్చి ఇప్పుడు వారందరినీ ఇతర రాష్ట్రాలకు పంపేందుకు వీలుగా సువేందు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు గత సంవత్సరాల్లో నియామక అవకాశాలు కోల్పోయిన అభ్యర్థులకు ఐదేళ్ల వయో సడలింపును ప్రకటించారు. అలాగే రాష్ట్రంలో భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)ను తక్షణమే అమలు చేయాలని ఆదేశించారు. గత ప్రభుత్వం బీఎన్ఎస్ (భారతీయ న్యాయ సంహిత)ను అమలు చేయలేదు. ఈ రోజు నుంచి దీనిని అమలు చేస్తున్నామని సువేందు తెలిపారు.














Click it and Unblock the Notifications