ప్రభుత్వాస్పత్రిలో 61మంది చిన్నారుల మృతి
భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రంలోని కటక్లోని ప్రభుత్వ పిల్లల ఆస్పత్రిలో విషాదం చోటు చేసుకుంది. గత రెండు వారాల నుంచి ఈ ఆస్పత్రిలో 61 మంది చిన్నారులు మృతి చెందారు. కాగా, ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
చిన్నారుల మృతులపై ప్రభుత్వం విచారణ చేపట్టింది. ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వల్లనే 61 మంది చిన్నారులు మృతి చెందారని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి అటాను ఎస్ నాయక్ అన్నారు.
ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు ఉద్యోగులను విధుల నుంచి తొలగించినట్లు చెప్పారు. ముగ్గురు సిబ్బందిపై క్రిమినల్ నేరం కింద విచారణ సాగుతోందని తెలిపారు.
ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా కారణంగానే ఇంతమంది చిన్నారులు మృతి చెందారని అన్నారు. కాగా, వైద్యానికి కావాల్సిన సౌకర్యాలు లేని కారణంగానే ఇలా జరిగిందని, తమ నిర్లక్ష్యం ఏమి లేదని వైద్యులు చెబుతున్నారు.
ఇది ఇలా ఉండగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో 50 మంది చిన్నారుల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. చిన్నారుల మృతికి నిరసనగా భారతీయ జనతా పార్టీతోపాటు ప్రతిపక్ష పార్టీలన్నీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డాయి.
గుర్గావ్లో కాల్పులు
ఢిల్లీ సమీపంలోని గుర్గావ్లో బుధవారం పోలీసులు, క్రిమినల్స్ మధ్య కాల్పులు జరిగాయి. గుర్గావ్లోని ఓ ప్రాంతంలో వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులు.. నలుగురు పాత నేరస్థులు కారులో వెళ్తుండటాన్ని గుర్తించారు.
వెంటనే కారును ఆపేందుకు ప్రయత్నించగా.. కారు డ్రైవర్ పోలీసులపై కాల్పులు జరిపాడు. దీంతో పోలీసులు కూడా ఎదురుకాల్పులు జరిపినట్లు ఏసీపీ రాజేశ్కుమార్ తెలిపారు. ఈ ఘటనలో ఇరువర్గాలు గాయపడగా.. నలుగురు నేరస్థులను అరెస్టు చేసినట్లు చెప్పారు.